తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిలోని పార్టీలు అధికారం పంచుకోవడమే కాదు టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలనీ చూస్తున్నాయి.అందుకే టీఆర్ఎస్ మీద పై చేయి సాదించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.
ఆ పార్టీకి తాము ఏ మాత్రం తీసిపోము అన్నట్టుగా.ప్రచారంలో దూసుకెళ్ళిపోతోంది.
ఇందులో భాగంగానే ఖమ్మంలో బుధవారం నిర్వహించిన భారీ ర్యాలీలో టీడీపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ ప్రచారానికి భారీ స్థాయిలో కార్యకర్తలు రావడం, ప్రజల నుంచి స్పందన బాగుండడంతో నామా లో గెలుపు ధీమా బాగా పెరిగింది.
ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తమ బలం చెక్కుచెదరలేదని, బలమైన క్యాడర్ పార్టీ వెంట ఉన్నారని నామా నాగేశ్వరరావు నిర్వహించిన ప్రచారంతో తేలిపోయింది.అసలు ఇప్పటికే టీడీపీ చేయించిన సర్వేలోనూ… టీఆర్ఎస్ అంతర్గతంగా ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా చేయించిన సర్వేలోనూ ‘నామా’ విజయం ఖాయం అని తేలిపోవడంతో ఈ సీటుపై టీఆర్ఎస్ ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది.స్థానికంగా నామాకు మంచి పరిచయాలు ఉండడం … తరచు స్థానిక నాయకులతో టచ్ లో ఉండడం మొదలయిన అంశాలన్నీ ఈయనకు బాగా కలిసొచ్చేవే.
2004లో తొలిసారి ఖమ్మం లోక్సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసిన నామా.అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు.అనంతరం 2009లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.
తిరిగి 2014లో మళ్లీ ఎంపీగానే పోటీచేసి వైసీసీ అభ్యర్థి పొంగులేటి చేతిలో 10 వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే ఎక్కడా తన క్యాడర్ చెక్కు చెదరకుండా ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు.ఇప్పుడు ఆయనకు అదే బలం కాబోతోంది.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నామా ప్రస్తుతం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్నారు.ఖమ్మం ఎంపీగా ఉన్నప్పడు తన నిధులతో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్యా, వైద్యం సదుపాయాలకు నిధులు కేటాయించారు.నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా వైద్య శిబిరాలు పేద విద్యార్ధులకు సహాయం అందిస్తున్నారు.బయ్యారం ఇనుప గనులు ప్రైవేటు పరం కాకుండా అప్పటి లీజులను రద్దు చేయించారు.ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు కాగా …
ఖమ్మం అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉంది.అసలు వాస్తవంగా ఈ సీటుపై ముందుగా కాంగ్రెస్ పార్టీనే కన్ను వేసింది.ఆ పార్టీలో కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో… ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు వదులుకొనేందుకు సిద్ధం పడలేదు.అయితే ఇక్కడ కాంగ్రెస్ కంటే టీడీపీకి చెందిన నామా కే గెలుపు అవకాశాలు ఉన్నాయని అనేక మార్గాల ద్వారా రుజువు అవ్వడంతో ఈ సీటు వదులుకోక తప్పలేదు.
ఇక ఈ నియోజకవర్గ పరిస్థితికి వస్తే … మహాకూటమిలో కాంగ్రెస్ టీడీపీలు కలిసిపోయినా.స్థానికంగా మాత్రం నాయకుల మనసులు కలవడం లేదు.
ఎవరి దారి వారిదే అన్నట్టు గా ఇక్కడ వ్యవహారం ఉంది.ఇక్కడ కాంగ్రెస్ టీడీపీలు కలిసి సమన్వయంతో పనిచేస్తే … టీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ లు కూడా దక్కే ఛాన్స్ ఉండదు.
ఈ విషయం పై నామా కూడా పెద్దగా పట్టించుకోనట్టుగానే కనిపిస్తోంది.ఇదే ఇక్కడ పెద్ద మైనెస్ గా మారింది.
ఈ లోపాలను సరిచేసుకుని స్థానిక కాంగ్రెస్ నాయకులతో సఖ్యతగా ఉంటే నామా గెలుపు నల్లేరు మీద నడకే.
.