జనసేన పార్టీలో అప్పుడే లొల్లి మొదలయినట్టు తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే లెక్కలు తేలకముందే కొంతమంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోవడం పార్టీలో కలకలం రేపుతోంది.దీనంతటికి కారణం పార్టీలో ఎప్పటి నుంచో నెలకొన్న వర్గ విభేదాలే కారణంగా తెలుస్తోంది.ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలో కొంతమందికి అన్యాయం జరిగిందని, మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేసిన వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం కల్పించారని కొంతమంది నాయకులు అలకబూనారట.
దీనికితోడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించి పార్టీ కోసం ఆరుగాలం కష్టపడ్డ తమను పక్కనపెట్టేశారని పాత నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజాగా జనసేన పార్టీ ట్రెజరర్గా ఎప్పటి నుంచో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న మారిశెట్టి రాఘవయ్య రాజీనామా చేశారు.
తాను జనసేన కార్యక్రమాల నుంచి విరమించుకుంటున్నాను అంటూ ప్రకటన చేశారు.వాస్తవానికి ఆయన కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.ఎన్నికలు ముగిసిన తర్వాత తన రాజీనామా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదని భావించి దూరం అవుతున్నట్టు ప్రకటించారు.2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొద్ది మందిలో రాఘవయ్య ఒకరు.పేరుకు మాత్రం పవన్ కల్యాణ్ అయినా వ్యవహారాలన్నీ రాఘవయ్య చక్కబెట్టేవారు.కాకపోతే ఇప్పుడు కొత్త నాయకులకు పవన్ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం పాత నాయకులకు మింగుడుపడడంలేదు.
అదీ కాకుండా కొంత మంది నాయకులు రాఘవయ్య టిక్కెట్లు ఆశ చూపి డబ్బులు వసూలు చేసారంటూ పవన్ కు ఫిర్యాదు చేశారట.ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాఘవయ్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.ఆ తరువాత నుంచి రాఘవయ్య పార్టీలో కీలకంగా వ్యవహరించడం తగ్గించినా పవన్ పట్టించుకోకపోవడం మరింత బాధ కలిగించిందట.జనసేన పార్టీకి సంబంధించి ఇటీవలి చాలా మంది నేతలు దూరమయ్యారు.
పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు కొందరు వెళ్లిపోగా, మధ్యలో వచ్చిన వారు మరికొందరు వెళ్లిపోయారు.అధికార ప్రతినిధులుగా ఉన్న విజయ్ బాబు, అద్దేపల్లి శ్రీధర్ లు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.