భర్త మరణించాడని, ఆయన మృతదేహాన్ని ఉంచిన శవపేటిక తనతో పాటే ఉందని తెలియకుండా ఓ ప్రవాస భారతీయురాలు విమానంలో భారతదేశానికి వచ్చిన విషాద ఘటన కేరళలో జరిగింది.
కన్నూరుకు సమీపంలోని చుజాలికి చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ సహీర్ తన భార్య షిఫానాతో కలిసి ఒమన్లో నివసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఓ రోజున సహీర్ మైదానంలో ఫుట్బాల్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది.దీంతో తోటి ఆటగాళ్లు, స్నేహితులు సహీర్ను నిజ్వాలోని బదర్ అల్ సమా ఆసుపత్రికి తరలించారు.
అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు.అయితే సహీర్ మరణవార్తను వారి స్నేహితులు, బంధువులు అతని భార్య షిఫానాకు తెలియజేయలేదు.
దీనిపై తీవ్రంగా ఆలోచించిన అతని మిత్రులు ఒక ప్లాన్ వేశారు.సహీర్ కరోనా వైరస్ లక్షణాలను కలిగి ఉన్నాడని, ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉన్నాడని అతని స్నేహితులు షిఫానాకు చెప్పారు.
మూడు నెలల గర్భవతిగా ఉన్నందున, నిన్ను ఆసుపత్రిలోకి అనుమతించరని తిరిగి భారతదేశానికి వెళ్లేందుకు ఆమెను ఒప్పించారు.దీంతో షిఫానా సోమవారం మస్కట్ నుంచి కోజికోడ్ వెళ్లే ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఎక్కింది.
సహీర్ స్నేహితులు కొందరు అతని మృతదేహాన్ని ఉంచిన శవపేటికను అదే విమానంలోకి ఎక్కించారు.ఈ సంగతి షిఫానాకు తెలియకుండా వారు అప్రమత్తంగా వ్యవహరించారు.
షిఫానా, సహీర్లకు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి మొదటిసారి మస్కట్ వచ్చి, సంతోషంగా గడిపటంతో పాటు గర్భం దాల్చడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఇంతలో సహీర్ ఆకస్మిక మరణం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.