కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.అందుకే చాలామంది కరోనా కోసం పోరాడిన డాక్టర్లు,నర్సులకు సైతం ఈ కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా ఈ వైరస్ ఇతరులకు అంటుకొని వారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.అందుకే వైద్య సిబ్బంది కూడా ఈ వైరస్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ చికిత్స చేయాల్సి ఉంటుంది.
అయితే కేరళ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అక్కడ కరోనా టెస్ట్ లు నిర్వహిస్తుంది.దక్షిణ కొరియా లో ఉపయోగించిన ఒక పద్దతిని అవలంబిస్తూ కేరళ రాష్ట్రంలో కియోస్క్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.
ఇంతకీ ఈ కియోస్క్ డెస్క్ లు అంటే ఏంటంటే కియోస్క్ కేబిన్ నాలుగువైపులూ అద్దాలు ఉంటాయి.కరోనా అనుమానితుడు కియోస్క్ ముందు కూర్చుంటే హెల్త్ వర్కర్లు గ్లవుజు ధరించి విండో ద్వారా అతని నమూనాలు తీసుకుంటారు. దీంతో బాధితులతో హెల్త్ వర్కర్లు ఎక్కడా భౌతికంగా కాంటాక్ట్ కారు.దీనితో భౌతిక కాంటాక్ట్ లేకపోవడం తో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశమే లేదు అన్నమాట.
దక్షిణ కొరియా లో ఉపయోగించిన ఈ కియోస్క్ లను మొట్ట మొదటి సారిగా కేరళ రాష్ట్రం లో ఉపయోగిస్తున్నారు.హెల్త్ వర్కర్లు కరోనా బాధితుడి నుంచి రక్తం, కళ్లే నమూనాలు తీసుకున్న తర్వాత వారు ధరించిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్(పీపీఈ)ను తీసి పారేయాల్సి పడుతుంది.
ఎందుకంటే పీపీఈ పై వైరస్ ఉంటుంది అన్న అనుమానం తో ఈ పని చేయడం తప్పనిసరి అయిపొయింది.దీనితో వాటి కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కరోనా పరీక్షలు చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో మనదేశంలో ఇంతవరకు కేవలం 80 వేలమందికి మాత్రమే ఆ టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే పరీక్ష ఖర్చును భారీగా తగ్గించేందకు కేరళ ప్రభుత్వం వినూత్న ప్రయత్నంగా ఈ కరోనా కియోస్క్ (డబ్బా)లను ఏర్పాటు చేసింది.
వీటి ద్వారా బాధితుల నమూనాలను సులభంగా తీసుకోవచ్చు.
ఎర్నాకుళం జిల్లా ఆస్పత్రిలో వాకిన్ సింపుల్ కియోస్క్ పేరుతో ఏర్పాటు చేసిన వీటి ద్వారా రక్తం, కళ్లె నమూనాలను కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకోవచ్చు.కేవలం చేతులు బయటకు పెట్టి రక్తం,కళ్లే తీసుకున్న తరువాత వారి చేతికి ఉన్న గ్లవుజ్ లను తీసి పారేస్తే సరిపోతుంది.ఇక ఖర్చు విషయం గురించి చెప్పాలి అంటే ఒక్కో కియోస్క్ ను ఏర్పాటు చేయాలి అంటే రూ.40 వేలు మాత్రమే అవుతుందట.మరి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోనే ఉన్న ఈ కియోస్క్ డెస్క్ లు దేశవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తారేమో చూడాలి.
కేరళ రాష్ట్రంలో కూడా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.