విద్యార్థుల మధ్య తేడా ఉండకూడదని చెప్పి స్కూళ్లలో పిల్లలకు యూనిఫాంలు పెడతారు.దీంతో విద్యార్థులందరి మధ్య సమైక్యత ఉంటుందని అందరి భావన.
అయితే కేరళలోని ఆ స్కూల్ యూనిఫాం మాత్రం అలా కాదు, భేద భావాల సంగతి పక్కన పెడితే, అది బాలికలకు ఇబ్బందికరంగా ఉందని, ఆ డ్రెస్లో వారు అసభ్యంగా ఉన్నారని తాజాగా దుమారం రేగింది.ఓ ఫొటోగ్రాఫర్ ఆ స్కూల్ యూనిఫాం వేసుకున్న ముగ్గురు బాలికలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది.
అలాంటి అసభ్యకరమైన యూనిఫాంను వెంటనే ఉపసంహరించుకుని, కొత్త యూనిఫాంను బాలికలకు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల లోకి వెళ్తే.
కేరళలోని కొట్టాయం అరువితురలో ఉన్న సెయింట్ అల్ఫోన్సా పబ్లిక్ స్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థినులు యూనిఫాంలో ఉండగా జచరయ్య పొంకున్నమ్ అనే ఓ ఫొటోగ్రాఫర్ వారిని ఫొటో తీశాడు.అనంతరం వాటిని ఫేస్బుక్లో పెట్టాడు.
దీంతో ఆ విద్యార్థినులకు యూనిఫాం ఇబ్బందిగా ఉందని, అది అసభ్యంగా ఉందని, వెంటనే ఆ స్కూల్ ఆ యూనిఫాంను మార్చేయాలి నెటిజన్లు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే కోజికోడ్కు చెందిన నౌషద్ థెక్కాయిల్ అనే వ్యక్తి చైల్డ్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించాడు.
సదరు యూనిఫాంను పెట్టిన స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇదిలా ఉండగా అసలు ఆ యూనిఫాంకు, తమ స్కూల్ యూనిఫాంకు సంబంధం లేదని, రెండు యూనిఫాంలను పరిశీలిస్తే అవి వేర్వేరుగా ఉంటాయని, కావాలని ఎవరో ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారని ఆ స్కూల్ యాజమాన్యం చెబుతోంది.అయినా ఆ యూనిఫాంపై ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, తల్లిదండ్రులు ఎవరూ యూనిఫాం గురించి ఇప్పటి వరకు ఎలాంటి కంప్లెయింట్ చేయలేదని స్కూల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది.