కరోనా కట్టడి కోసం ప్రపంచదేశాలు పాటిస్తున్న లాక్డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు.ఒకే దేశంలో ఉన్నప్పటికీ కుటుంబసభ్యులను సైతం కలవలేని పరిస్ధితి.
దీంతో ఒంటరితనం భరించలేక ఎంతోమంది లోలోపల కుమిలిపోతున్నారు.ఈ క్రమంలో దుబాయ్లో స్థిరపడిన ఓ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త కుటుంబసభ్యులకు దూరమయ్యాడు.
లాక్డౌన్ కారణంగా భార్య ఓ చోట, పెద్ద కుమారుడు మరో చోట చిక్కుకుపోయారు.వారందరినీ కలపడానికి రెండు నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలమవ్వడంతో తమను కలిపిన వారికి రూ.10 లక్షల బహుమతి ప్రకటించాడు.
కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన కేఆర్ శ్రీకుమార్ ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లారు.
అక్కడ వ్యాపారవేత్తగా స్ధిరపడ్డారు.అయితే ఆయన భార్యాపిల్లలు మాత్రం కేరళలోని స్వగ్రామంలోనే నివసిస్తున్నారు.
భారతదేశంలో లాక్డౌన్కు కొద్దిరోజుల ముందు వీరి పెద్ద కుమారుడు తమిళనాడులోని తిరుచ్చికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు.ఇదిలావుంటే చిన్న కుమారుడితో కలిసి ఆమె భార్య కర్ణాటకలోని మంగుళూరుకు వెళ్లి ఇరుక్కుపోయారు.
లాక్డౌన్తో ఊహించని విధంగా వీరంతా వేరు వేరు ప్రదేశాల్లో చిక్కుకుని, ఎప్పుడెప్పుడు ఒక చోట కలుసుకుంటామా అని ఎదురుచూస్తుండగా ప్రధాని మోడీ రెండు సార్లు లాక్డౌన్ను పొడిగించారు.కేంద్రం నిర్ణయంతో తీవ్ర నిరాశకు లోనైన శ్రీకుమార్.దుబాయ్ నుంచి భారత్కు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు.కనీసం తన భార్యాపిల్లలనైనా ఒక చోటికి చేరుద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు.
అవన్నీ విఫలమవ్వడంతో చివరికి ఓ నిర్ణయం తీసుకున్నారు.తన కుటుంబసభ్యులను ఇంటికి సురక్షితంగా చేర్చిన వారికి రూ.10 లక్షల నజరానా ఇస్తానని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.ఇందుకు మే 12 వరకు డెడ్లైన్ విధించారు.
శ్రీకుమార్ పెట్టిన పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.ఆయన ప్రయత్నం ఫలించి శ్రీకుమార్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుందాం.