దేశంలోనే ఎన్ఆర్ఐల సంక్షేమానికి అత్యథిక ప్రాధాన్యతను ఇస్తున్న కేరళ రాష్ట్రం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.విదేశాలలో పనిచేస్తున్న, స్థిరపడిన ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కలిగించేలా ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951కి తగిన సవరణలు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్కు సిఫారసు చేస్తూ కేరళ ఎన్ఆర్ఐ కమీషన్ శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రవాస భారతీయులు ప్రాక్సీ ద్వారా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని అందులో పేర్కొంది.
ఈ తీర్మానం మిలియన్ల మంది ఎన్ఆర్ఐలు తమ ఓటు హక్కును భారతదేశం వెలుపల నుంచి వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తుందని కమీషన్ సభ్యుడు డాక్టర్ షంషీర్ వయాలిల్ అన్నారు.
ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, భారత ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.దీనిని అమలు చేయడానికి సంబంధిత ఏజెన్సీలపై తాము ఒత్తిడి పెంచుతామని కమీషన్ ఛైర్మన్ జస్టిస్ పీడీ రాజన్ స్పష్టం చేశారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన 10 మిలియన్ల మంది ఎన్నారైలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం కోసం కూడా కమీషన్ ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని ఎన్నారై కమీషన్లను కూడా సంప్రదించి, తమ డిమాండ్కు మద్ధతు కోరతామని ఆయన తెలిపారు.ఇందుకోసం దేశంలోని అన్ని ఏజెన్సీలు కలిసి రావాలని.
అనుకూలమైన నిర్ణయం ఎన్నారైలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని రాజన్ చెప్పారు.
ఎన్నారైల ఓటు హక్కు కోసం ఇప్పటికే డాక్టర్ షంషీర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్ఆర్ఐ ప్రాక్సీ ఓటింగ్ హక్కులను ఎనేబుల్ చేసే బిల్లును లోక్సభ 2018 ఆగస్టులో ఆమోదించింది.ఎన్నారైల చట్టాలను సవరించడానికి ఎన్నికల సంఘం నిపుణుల కమిటీ చట్టపరమైన సిఫారసులను న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిన తర్వాత అందుకు అనుగుణంగా లోక్సభ బిల్లును ఆమోదించింది.
అయితే 16వ లోక్సభ రద్దు కావడంతో బిల్లు ప్రక్రియ అర్థాంతరంగా ముగిసింది.