ప్రేమంటే పెళ్లి చేసుకునే వరకేనా దాని బాధ్యత ? కాదు చచ్చేవరకు ప్రేమను నిలుపుకోవటమే అనే ప్రేమార్థాన్ని నిలుపుకుంటున్న ప్రేమికులు ఎంతమంది ? పెళ్లికి ముందు చాలా గాఢంగా ప్రేమిస్తారు.ఎప్పుడైతే పెళ్లి అవుతుందో అప్పుడు మునుపటంత ప్రేమ వుండదు.
రకరకాల ఇగోలు ఇద్దరి మధ్య తిష్ఠ వేస్తాయి.బాధ్యతలతో సతమతమవుతూ ప్రేమకు దూరం అవుతుంటారు.
కానీ కేరళకు చెందిన ఈ ప్రేమ జంట కష్టనష్టాలను ఎదిరించి నిజమైన ప్రేమంటే ఏంటో నిరూపించింది.కేరళలోని త్రిసూరు ప్రాంతానికి చెందిన షాన్ ఇబ్రహిం బాద్షా, శ్రుతిలు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.అన్ని ప్రేమకథల్లానే వీరి ప్రేమకు కూడా ఇరువురి పెద్దల నుంచి ఆటంకాలు ఎదరయ్యాయి.నానా తిప్పలుపడి పెద్దలను ఒప్పించి గత సంవత్సరం వివాహం చేసుకున్నారు.హమ్మయ్య పెళ్లి అయిందనుకున్నారు.చక్కగా కాపురం చేసుకుంటున్నారు.
ఇంతలోనే వారి పచ్చని కాపురం మీద విధి దుష్ఠకన్ను పడింది.
పెళ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రుతి అనారోగ్యం బారిన పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు శ్రుతి ఆరోగ్యానికి సంబంధించి ఓ భయంకర నిజాన్ని వెల్లడించారు.శ్రుతికి క్యాన్సర్ ఉందని చెప్పడంతో రెండు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసి షాన్ తట్టుకోలేకపోయాడు.గుండెలవిసేలా రోదించాడు.
అయితే.ఆమెను ఎలాగైనా బతికించుకోవాలన్న షాన్ సంకల్పమే శ్రుతికి ఊపిరి పోసింది.
ఆమెను బతికించుకోవాలని బలంగా నమ్మాడు.ఆమెకు అన్ని సేవలూ చేశాడు.శ్రుతికి కీమోథెరపీ ప్రారంభించారు వైద్యులు.అప్పుడు ఆమె జుట్టంతా ఊడిపోయింది.తన భార్యకు లేని తల వెంట్రుకలు తనకు కూడా వద్దని చెబుతూ, గుండు చేయించుకున్నాడు షాన్.అదృష్టమో, వారి ప్రేమ బలమైందోగానీ శృతి క్యాన్సర్ను జయించింది.
అతని ప్రేమ ఆమెకు ఊపిరి పోసిందనే చెప్పుకోవాలి.కాగా, వీరి తొలి పెళ్లిరోజు సందర్భంగా, తమ ప్రేమకథను, పడ్డ కష్టాలను వివరిస్తూ, ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు షాన్.
దీంతో వీరిద్దరి ప్రేమకథ వెలుగులోకొచ్చింది.