ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ చైనాని మరింత భయపెడుతూ ఉంటే ఇండియాలో మాత్రం కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది.ఇప్పటి వరకు నమోదైన కేసులలో కేరళ రాష్ట్రం టాప్ లో ఉంది.
ఈ నేపధ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజలలో అవగాహనా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసుంది.ఇప్పటికే విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చేశారు.
మరో వైపు సినిమా థియేటర్స్ కూడా మూతబడిపోయాయి.అలాగే భారీ సభలు, సమావేశాలు కూడా నిషేధించారు.
ప్రజలు వీలైంత వరకు ఇళ్లకే పరిమితం అయ్యి ఉండాలని సంకేతాలు ఇస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కేరళా ప్రభుత్వం ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనాపై పోరాటానికి కేరళ స్టార్టప్ మిషన్ కొచ్చిలో ప్రయోగాత్మకంగా రోబోలను వినియోగంలోకి తీసుకొచ్చింది.ఇప్పటివరకు రెండు రోబోలను రంగంలోకి దింపారు.ఈ రోబోలను అసిమోవ్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది.ఈ రోబోల్లో ఒకటి ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, నాప్ కిన్స్ పంపిణీ చేస్తుంది.
మరో రోబో స్క్రీన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే కరోనా ప్రకటనలను, సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.రోబోల వినియోగంతో ప్రజల్లో భారీ ఎత్తున స్పందన రావడంతో మరిన్ని రోబోలని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు కేరళ స్టార్టప్ మిషన్ వర్గాలు తెలిపాయి.
ఎయిర్ పోర్టుల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రోబోలను వినియోగించాలని స్టార్టప్ మిషన్ భావిస్తోంది.