భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం కేరళ.దేశంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదవ్వగా, ఆ తర్వాత నుంచి విదేశీయులు, ఎన్ఆర్ఐల రాకతో అది మరింత తీవ్రరూపం దాల్చింది.
అయినప్పటికీ సీఎం పినరయి విజయన్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తున్నారు.ఇదే సమయంలో వివిధ దేశాల్లో స్థిరపడిన కేరళ వాసుల యోగక్షేమాలను కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఎన్ఆర్ఐ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వైరస్ కారణంగా వివిధ దేశాల్లో మలయాళీల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అధ్యయనాల ప్రకారం.ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది కేరళవాసులు వివిధ దేశాలకు వలస వెళ్లారు.వీరిలో 90 శాతం మంది మధ్యప్రాచ్యంలో పనిచేస్తుండగా, ఇతర దేశాల పాస్పోర్ట్లు కలిగి వున్న వారు మరో రెండు మిలియన్ల మంది ఉన్నారు.కోవిడ్ 19 కారణగా మలయాళీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఎన్ఆర్ఐ ప్రముఖులను ఆయన అభ్యర్ధించారు.
మధ్యప్రాచ్యంలో కేరళతో పాటు అనేక మంది భారతీయులు పాఠశాలలు, విద్యాసంస్థలు నడుపుతున్నారు.లాక్డౌన్ కారణంగా వాటిని ప్రస్తుతం మూసివేశారు.ఇందువల్ల ఏర్పడిన ఆర్ధిక నష్టాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఆర్ఐ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై స్పందించిన విజయన్.ఈ విషయంపై తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.
ఇక కోవిడ్ 19 కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్యోగ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ప్రవాసులు తెలిపారు.
ఒకవేళ అలాంటి పరిస్ధితులు ఎదురైతే పునరావాస ఏర్పాట్లను చేస్తానని పినరయి విజయన్ వారికి హామీ ఇచ్చారు.కరోనా కారణంగా ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తో చర్చించామని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రతి దేశంలో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా మలయాళీలను కోరిన ఆయన పార్ట్టైమ్ ఉద్యోగాలను ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాయం చేయాలని ఎన్ఆర్ఐ ప్రముఖులకు విజయన్ విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారిలో ఎంఏ యూసఫ్ అలీ, రవి పిళ్లై, టీ.హరిదాస్ మురళీ తుమ్మార్కుడి తదితరులు ఉన్నారు.