కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎన్ఆర్ఐలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి తెలిసిందే.తాజాగా కోవిడ్-19 కారణంగా వివిధ దేశాల్లో స్థిరపడిన మలయాళీల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆయన ఎన్ఆర్ఐ ప్రముఖులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు విజయన్ రంగంలోకి దిగారు.
గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన మలయాళీలు కరోనా కారణంగా పాఠశాలలు మూసివేసినప్పటికీ తమ పిల్లల స్కూల్ యజామాన్యాలు ఫీజు చెల్లించాల్సిందిగా కోరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు పాఠశాల ఫీజును మినహాయించాలని, వీసాలను పొడిగించాలని కోరారు.సంక్షోభ సమయంలో తాను ప్రవాస భారతీయులకు అండగా ఉంటానని చెప్పిన విజయన్.ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆయన సోమవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు.
వివిధ దేశాల్లో స్థిరపడిన మలయాళీల వీసా గడువును ఆరు నెలలు పొడిగించాలని, వారికి ఆరోగ్య బీమాను అమలు చేయాలని సీఎం అభ్యర్ధించారు.లాక్డౌన్ ముగిసిన అనంతరం ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి చేరుకోవడానికి అనుమతంచాలని ముఖ్యమంత్రి కోరారు.మరోవైపు ఏప్రిల్ 30 లోపు ఎలాంటి పత్రాలు లేకుండా దేశం విడిచి వెళ్లడానికి విదేశీ కార్మికులకు కువైట్ అనుమతి ఇచ్చిందని విజయన్ ప్రస్తావించారు.అయితే భారతీయులకు ఇందులో ప్రయోజనం కలగాలంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఫీజు కింద ఐదు దినార్లను ఎత్తివేయాలని సీఎం కోరారు.
దీని వల్ల కువైట్లో ఉన్న సుమారు 40,000 మంది భారతీయులకు ప్రయోజనం కలుగుతుందని జైశంకర్కు ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు