ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో పరిస్థితి అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపించినా, లోలోపల మాత్రం పరిస్థితి పొగలు, సెగలు అన్నట్టుగా తయారయ్యింది.ప్రస్తుతం టీఆర్ఎస్ అగ్ర నేతల దృష్టి అంతా హుజురాబాద్ ఎన్నికలపైననే ఉంది.
మిగతా ఏ విషయాలనూ పట్టించుకునే తీరిక లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది నాయకులకు కీలకమైన నామినేటెడ్ పదవులను కట్టబెట్టి మరికొందరికి మంచి ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న పరిణామాలపై చర్చ జరుగుతోంది.
కొద్ది నెలల క్రితం వరకు టిఆర్ఎస్ హవా బాగా నడిచింది.తెలంగాణలో ఆ పార్టీ హవానే కనిపించేది.
బిజెపి, కాంగ్రెస్ వంటి
ప్రత్యర్థులు ఉన్నా, వారి బలం అంతంతమాత్రంగానే ఉండడంతో పెద్దగా ఇబ్బందులు కలగలేదు.అయితే ఇటీవల కాలంలో బిజెపి బాగా బలం పుంజుకోవడం , తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అవ్వడం, ఇటువంటి ఎన్నో పరిణామాలతో టిఆర్ఎస్ అప్రమత్తం అయ్యింది.
ఎక్కడా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు.అయితే ఇదే సమయంలో టిఆర్ఎస్ లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.తాము ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నా, తమకు పదవులు ఇచ్చే విషయంలో కెసిఆర్ పట్టించుకోవడంలేదనే అసంతృప్తి ఉంది ఈ క్రమంలోనే ఎంతో మంది పార్టీ నాయకులు ఇప్పటికే టిఆర్ఎస్ రాజీనామా చేయగా , మరి కొంతమంది ఇతర పార్టీల నుంచి మంచి ప్రాధాన్యం ఇస్తామనే హామీ లను తీసుకుని మరీ టీఆర్ఎస్ కి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతుండడం వంటి పరిణామాలు కేసీఆర్ కు ఆందోళన పెంచుతున్నాయి.
ఒకవైపు హుజురాబాద్ ఎన్నికలు ఉండగానే, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరితే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం తో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అంతేకాదు పార్టీ మారుతారు అనే సంకేతాలు ఇస్తున్న నాయకులను బుజ్జగించేందుకు మంత్రులు ఎమ్మెల్యేలను సైతం రంగంలోకి దించారట.