తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపై రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతోంది.క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుంది ? ఎవరి పదవి ఊడబోతోంది అనే విషయం పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.ఈ సందర్భంగా కేసీఆర్ , కేటీఆర్, కవితలకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా అనే విషయంలోనూ క్లారిటీ లేకుండా పోయింది.ఇది ఇలా ఉంటే ఇప్పుడు చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో కొంతమందిని తప్పించి వారి స్థానం లో కొత్తవారిని తీసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ సందర్భంగా పదవి కోల్పోయే వారిలో మొదటి పేరు మంత్రి ఈటెల రాజేందర్ గా టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.ఈయనపై వేటుపడడానికి కారణం ఆయన ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కీలక సమావేశాల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే బయటకి లీక్ చేస్తున్నారని కేసీఆర్ అనుమానిస్తున్నాడు.
ఈటెల కూడా తనకు ఉధ్వాసన తప్పదనే విషయాన్ని గ్రహించి ఓ సమావేశంలో ఉద్వేగభరితంగా ప్రసంగించడం కూడా హాట్ టాఫిక్ గా మారింది.అలాగే వేటు పడేవారిలో రెండో స్థానంలో విద్యాశాఖ మంత్రిని కూడా మార్చబోతున్నారనే చర్చ టీఆర్ఎస్ లో మొదలయ్యింది.విచిత్రం ఏంటంటే ఆ విద్యాశాఖ మంత్రి సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన జగదీష్ రెడ్డి.ఆయన్ను తొలగించడానికి కారణం ఏంటంటే, మంత్రిత్వ శాఖను సమర్థంగా ముందుకు నడిపించడంలో ఆయన తడబడుతున్నారనే అభిప్రాయం కేసీఆర్ లో బలంగా నాటుకుపోయింది.
అదీ కాకుండా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశం కూడా పార్టీకి చెడ్డపేరు తెచ్చిన సంగతి తెలిసిందే.ఆ సమయంలోనే ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది.
నైతిక బాధ్యత వహించరా అంటూ విపక్షాలూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.పార్టీపరంగా చూసుకున్న సొంత జిల్లాలో పార్టీని అనుకున్న రీతిలో బలోపేతం చేయలేకపోతున్నారనే అభిప్రాయమూ కేసీఆర్ లో ఉంది.
ఈ క్రమంలో ఆయనపై వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది.
ఆ తరువాత వేటు పడే వారి స్థానంలో మహిళా శిశు సంక్షేమం, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.వాస్తవంగా చూస్తే మల్లారెడ్డి కి మంత్రి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు.రంగారెడ్డి జిల్లాలో చాలా మంది కీలక నాయకులు, సీనియర్ శాసనసభ్యులు ఉన్నావారందరిని కాదని మల్లారెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
అయితే ఆ మంత్రిత్వ శాఖల్ని సమర్థంగా నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారనేది కేసీఆర్ అభిప్రాయమాట.అందుకే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించి ఆ స్థానంలో అదే జిల్లాకు చెందిన సబితా ఇంద్రారెడ్డి అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా మార్పు రాకుండా చేసినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నాడట.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఈ ముగ్గురు పేర్లు వేటు పడే వారి జాబితాలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా ఇప్పుడు చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ అనేక వివాదాలకు, అలకలకు, టీఆర్ఎస్ లో మరెన్నో సంచలనాలకు కారణం కాబోతోంది అనేది మాత్రం వాస్తవం.