తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరూ రాజకీయాల్లో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినవారే.రాజకీయాలంటే వీరిద్దరికీ కొత్తేమీ కాదు.
ఇక్కడ ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కూడా కాదన్న విషయం బాగా తెలుసు.అందుకే ఇప్పుడు వీరు బీజేపీతో వీరు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
తాజాగా కేసీఆర్ జగన్ రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ లో అత్యవసర భేటి నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ, ఏపీలో దూకుడుగా ముందుకు వెళ్తున్న విషయాన్ని ఈ భేటీలో చర్చించారు.
ఎలాంటి సందర్భం లేకుండానే అత్యవసరంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కసారి భేటి కావడం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దక్షణాదిన పాగా వేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో వారి వ్యూహనికి చెక్ పెట్టడానికి వీరిద్దరూ కలిసి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.
తెలంగాణాలో బలపడి వచ్చే ఎన్నికల నాటికి అధికారం చేపట్టాలనే ఆలోచనతో బీజేపీ గత ఎన్నికల ముందు నుంచే టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తోంది.పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు కూడా బీజేపీ దక్కించుకుంది.ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవితను ఓడించి అందరికి షాక్ ఇచ్చింది బీజేపీ.
తెలంగాణాలో కాంగ్రెస్ను మూడో స్థానానికి పరిమితం చేసి, టీఆర్ఎస్కు తానే పోటీ అన్నట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది.కేసీఆర్ పాలనపై దీటైన విమర్శలు చేస్తూ ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళిపోయింది.
ఇక ఆంద్రప్రదేశ్లో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని చూస్తోంది.అసెంబ్లీ ఎన్నికల వరకు సైలెంటుగా ఉన్న బీజేపీ ఎన్నికల తరువాత తన రూటును మార్చుకుంటోంది.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఇరుకున పెడుతూ ఎదురుదాడిని మొదలుపెట్టింది.మొన్న కాకినాడలో ఆ పార్టీ వ్యూహకర్త రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన, పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో బీజేపీ ఎదగకుండా చూడాలని కేసీఆర్, జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తట్టుకోవడం సులువు అవుతుందని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.ప్రగతి భవన్లో గంటపాటు జరిగిన సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా అయినా పాగా వేయాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తుండడంతో, రెండు పార్టీల అధినేతలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు.అందుకే రెండు రాష్ట్రాల్లో ప్రజల మద్దతు కూడగడుతూనే కేంద్రంలో ఉన్న బీజేపీ టార్గెట్ చేసే అంశాలను తెరపైకి తెచ్చి బీజేపీ కి రెండు రాష్ట్రాల్లో స్థానం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదే సమయంలో బీజేపీ కూడా జగన్, కేసీఆర్ భేటీలపై టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనే విషయంలో ఆరా తీసే విషంపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది.