టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు సొంత పార్టీ నేతల వ్యవహారం చికాకు తెప్పిస్తోంది.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు విషయంలో సొంత పార్టీ నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో పాటు, పార్టీ ఇమేజ్ దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉండడం, కడియం శ్రీహరి లాంటి వారే దళిత బంధు పథకం పై అనుచితంగా మాట్లాడుతూ ఉండడం, ఇలా అనేక అంశాలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కీలకమైన నాయకులకు కేసీఆర్ వార్నింగ్ తో కూడిన సూచనలు జారీ చేశారు.ముఖ్యంగా దళిత బంధు పథకం తో పాటు, దానికి సంబంధించిన నిధుల వ్యవహారం విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఇబ్బందులు వచ్చి పడతాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు దళిత బంధు పథకం విషయంలో ఆచితూచి మాట్లాడాలంటూ, ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులకు సీఎంవో కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.రెవెన్యూ, పోలీసు అధికారులు, దళితుల విషయంలో ఏవైనా సమస్య ఉంటే తక్షణమే స్పందించి, దాని పరిష్కార మార్గాలు చూడాలని ఆదేశించారు.
ఎవరైనా ప్రజలపై కానీ, పార్టీ పథకాల విషయంలో కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నోరు జారితే తాను తీసుకోబోయే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రజా సమస్యల విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని, అలాగే దళిత బందు విషయంలో ఇతర వర్గాల నుంచి డిమాండ్ లు వచ్చినా, సానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడాలని, ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా బీసీలు, ఇతర వర్గాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గట్టి హెచ్చరికలే అధికారులు, ప్రజా ప్రతినిధులకు వచ్చినట్లు సమాచారం.