ఏకులా వచ్చి మేకు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి బాగా తెలిసొస్తోంది. తెలంగాణాలో టీడీపీ పని అయిపోయిందని ఆ పార్టీ తెలంగాణాలో ఉన్నా లేనట్టేనని కేసీఆర్ ఊహించాడు. అయితే… టీడీపీ మాత్రం కొత్త ఎత్తులతో తెలంగాణాలో బలపడుతున్నట్టు కనిపిస్తోంది. మాహాకూటమి పేరుతో టీడీపీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు కి గండికొట్టే ప్రయత్నం చేస్తుండడంతో.. టీఆర్ఎస్ లో కలవరం మొదలయ్యింది. కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెసు, టీడీపీ మాత్రమే. మిగతా ప్రతిపక్షాలను ఆయన అసలు లెక్క చేయడంలేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్ కి ఎంఐఎం అండ ఉంది. బిజెపితో అసలు భయమే లేదు. ఇక కేసీఆర్ భయం అంతా .. ఒక్క మాహా కూటమి గురించే.
తెలంగాణాలో టీడీపీ పోటీలో అయితే ఉంటుంది కానీ పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి అధినేత చంద్రబాబు వణికిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మీద పాత కేసులు ఎలా అయితే బయటకి తీసి వారిని జైలుపాలు చేస్తున్నాడో ఆ విధంగానే కేసీఆర్ తన ఓటుకు నోటు కేసు మళ్లీ తిరగతోడతాడనే భయం ఉంది. ఇక కేసీఆర్ బాబు ని భయపెట్టడానికి కారణం హైదరాబాదులో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలున్నాయి కాబట్టి, వారిలో టీడీపీ అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీని దెబ్బతీయగలితే కేసీఆర్కు ఎదురే ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ మీద, ప్రత్యేకించి చంద్రబాబు మీద దృష్టిపెట్టారు.
బాబు గత ప్రసంగాలను కూడా సేకరించి ఎన్నికల్లో వాటిని ప్రయోగించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుకొని నిన్న మొన్నటివరకు కాంగ్రెసును చంద్రబాబు అనేకసార్లు తిట్టిపోశారు. సోనియాగాంధీని, రాహుల్ను వ్యక్తిగతంగా విమర్శించారు. ఈ చరిత్రంతా బయటకు తీసి ప్రచారం చేయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అలాగే కాంగ్రెసు నేతలు చంద్రబాబుపై చేసిన విమర్శలను బయటకు తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా స్థాపించారని, అదే పార్టీతో బాబు పొత్తు పెట్టుకొని ద్రోహం చేశారని ప్రచారం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ తాజా ప్లాన్ బాబు కి కూడా తెలియడంతో ఆయన డైలమాలో పడ్డాడు. తెలంగాణ విషయంలో ముందుకా వెనక్కా అనే గందరగోళం లో పడిపోయాడు.