కొద్ది రోజులుగా చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత పెంచే విధంగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇవన్నీ హుజురాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు ఇబ్బందులు రాకుండా, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పైచేయి సాధించేందుకే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఇంటెలిజెన్స్ తో పాటు ప్రైవేటు సర్వే చేయించిన కేసీఆర్ కు ఆ సర్వేలో వచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఇప్పుడు అలర్ట్ అయినట్టు గా కనిపిస్తున్నారు .అందుకే హుజురాబాద్ లో గట్టెక్కేందుకు దళిత జపం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా దళితులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారని, వారు ఓటు వేసే అవకాశమే లేదనే రిపోర్టులు రావడంతోనే కెసిఆర్ ఇంతగా అలర్ట్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఇంటికి పది లక్షల చొప్పున దళితులకు ఇస్తామని ప్రకటించడం, తాజాగా బండ శ్రీనివాస్ అనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించడం, దళిత బంధు పథకం ఇవన్నీ హుజురాబాద్ లో ఆ సామాజిక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఈ నియోజకవర్గంలో దాదాపు 40వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.
వీరిలో ఎక్కువ మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం, ఈటెల రాజేందర్ ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉండడంతోపాటు , అన్ని సామాజిక వర్గాలతో సన్నిహితం గా వ్యవహరించడం ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న పలుకుబడి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు, రాజేందర్ కు ఈ సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకు రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తూ ,దళితులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.రాజేందర్ కు పూర్తిగా మద్దతు ఇస్తాయి అనుకుంటున్న సామాజిక వర్గాల్లో ఏదో రకంగా చీలిక తీసుకువచ్చి తమకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు కేసీఆర్ ఈ విధంగా స్పీడ్ పెంచిన ట్లుగా కనిపిస్తున్నారు.