రైతుబంధు విషయంలో గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ ఎంఎల్ఎలకు, నేతలకు కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.ఇక నుంచి ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలని, అలా వేస్తేనే రైతులకు రైతు బంధు వర్తిస్తుందనే షరతుపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.ప్రతి పక్ష పార్టీల నుంచి వ్యతిరేకత రావడం సహజమే.
కానీ గులాబీ బాస్ తీసుకన్న నిర్ణయంపై ఎంఎల్ఎలల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే రైతు బంధుపై తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలు, ఎంఎల్ఎలు ఎక్కడా బాహాటంగా వ్యక్త పరచనప్పటికినీ తమ సన్నిహుతులు, అనుచరుల వద్ద అంతర్గతంగా తమ ఆందోళనను వ్యక్త పరచినట్లు సమాచారం.
లాక్డౌన్ సమయంలో పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వమే ఇప్పుడిలా పంటమార్పిడి, రైతు బంధు విషయంలో నిర్ణయం తీసుకోవడం నాయకులకు కాస్త కలవరపాటును గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.రైతు పండించిన వరి, పత్తి ఇతర పంటలు మార్కెట్కు రాకుండానే గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను పెట్టి అక్కడి నుంచే పంటలను కొనుగోలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం.
కానీ ఏ పంట వేయాలో తామే నిర్ణయిస్తామని గులాబీ బాస్ ఇప్పటికే చెప్పేయడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.గత ఎన్నికల్లో ఓట్లు రాల్చిన రైతుబంధుకు ఈ విధమైన కండీషన్లు పెట్టడంతో ఇప్పడు జనం నుంచి రైతు బంధుకు ఏవిధమైన రియాక్షన్ వస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
మరోపక్క ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతి పక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి.
ఇప్పటికే పోతిరెడ్డి పాడు విషయంలో గులాబి పార్టికి ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.దీనికితోడూ చెప్పిన పంటలనే వేయడమనేది ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది.రైతుబంధు పథకాన్ని ఆంక్షలు పెట్టడంతో విపక్షాలకు పార్టీని విమర్శించే అవకాశం తామే ఇచ్చినట్లుగా అయిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
వర్షాలు కురిస్తే మరో కొద్ది రోజుల్లో పంటలు వేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు.గతేడాది ఇదే సమయానికి పంట పెట్టుబడి సాయం కింద రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి.
ఇప్పడు ఆంక్షల పేరుతో రైతు బంధు ఇవ్వకపోతే సమస్య తీవ్రమవుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.రైతు బంధులో కోత విధించేందుకే ఇలాంటి ఆంక్షలు పెట్టారని బిజెపి, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
అలాగే రైతుల మద్దతును పొందే అవకాశం అంతంతమాత్రంగానే ఉంటుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నాయి.రాబోయే రోజుల్లో రైతు బంధు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితులు వస్తాయెమోనని అధికారపార్టీ నేతలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
అనుకున్న మార్పు వస్తుందా!!
మరోపక్క చెప్పిన పంటలనే వేయాలని లేకుంటే రైతు బంధు వర్తించదని హెచ్చరించే తీరు దేనికి సంకేతమని రైతులు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.ఏ భూమిలో ఏ పంటలు వేయాలో అనేదానిపై భూమికి సారవంతమైన పరీక్షలు, పంటకు ధరలు నిర్ణయించకుండా పంట మార్పిడి చేయడమేంటని వాదనలు లేవనెత్తుతున్నారు.నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు పోకుండా అనుకున్నదే తడువుగా అన్నట్లు తాము చెప్పిన పంటలనే వేయాలనడం ఒక రకమైన బెధిరింపులాంటిదేనని ఇతర పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రైతు ఆత్మహత్యల నివారణకు 2016లో పత్తి పంట నుంచి రైతులను మళ్లించేందుకు పెసర, కంది పంటలు వేసేలా చర్యలు తీసుకున్నారు.వ్యవసాయ అధికారులు ప్రచారాలను నిర్వహించి పంట మార్పిడికి అప్పట్లో ప్రోత్సహించి కంది, పెసర పంటలను క్వింటాలకు రూ.10వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం హామినిచ్చింది.కానీ తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసిన దాఖలాలున్నాయి.
మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం పంట మార్పిడి చేయాలనుకుంటుంది.అయితే దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం అనుకున్నట్లు మంచి ఫలితాలు వస్తే మంచిదే.
కానీ ఈ ప్లాన్ బెడిసి కొడితే రైతుల మద్దతు చూరగొన్న ప్రభుత్వమే రైతుల ఆగ్రహాన్ని చవిచూడకమానదనే అనుమానాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.వ్యవసాయం రంగంలో మార్పులు రావాలి…రావాల్సి ఉంది కూడా.
దేశానికి అన్నం పెట్టే రైతుకే భరోసా ఇవ్వలేకపోతే దేశాభివృద్ధికి విఘాతం కలిగినట్లే.రైతన్న అవసరాలను తెలుసుకొని వాటిని ప్రభుత్వాలు అందించాలి.
శాస్త్రీయ ఉత్పత్తి విధానం, విజ్ఞానం లేకుండా ఒక్క రాత్రికి రాత్రే మార్పులు రావాలని కోరుకోవడం సాధ్యం కాదని విద్యావంతులు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.