తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇచ్చే రిపోర్ట్స్ అందడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ముందుకు వెళ్లాలా వెనక్కి వెళ్లాలా అనే విషయంలో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే కేసీఆర్ పరిపాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఒకవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో ఎటువంటి స్పష్టమైన క్లారిటీ రావడంలేదు.దీనిపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటోంది.
దీనిపై టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.అయితే దీంట్లో కొంత ఉపశమనం కలిగించే విషయం ఏదైనా ఉందా అంటే అది హుజూర్ నగర్ లో విజయం సాధించడమే.
అదే ఉత్సాహంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి విపక్షాలను చిత్తుచిత్తుగా ఓడించాలని టీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.ఎప్పుడైనా మున్సిపోల్స్ రావచ్చని అందుకు అంతా సిద్ధంగా ఉండాలని అటు అధికారులకు, ఇటు పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ లో ముందు ఉన్న స్పీడ్ ఇప్పుడు కనిపించడంలేదు.అసలు మున్సిపల్ ఎన్నికలకు ఈ సమయంలో వెళ్లడం కరెక్టా కాదా అనే సందేహం కేసీఆర్ లో ఎక్కువగా కనిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం మున్సిపల్ పోల్స్ కు సంబంధించి నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు హుజూర్ నగర్ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని రిపోర్ట్ అందించారట.
ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మున్సిపోల్స్ కు వెళ్తే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊహించని నష్టం జరిగే ప్రమాదముందని కేసీఆర్ కి సూచించారట.హుజూర్ నగర్ బైపోల్ వేరు మున్సిపల్ ఎన్నికలు వేరని ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే అది మరింత తీవ్రంగా ఉందంటూ ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ఆలోచనలో పడ్డారట.
ఈ ఎన్నికలపై మరికొంతకాలం వేచి చూస్తే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికిన తరువాత దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.