అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించి, తమకు ఎదురే లేకుండా చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్ని రకాలుగా ఎత్తుగడలు వేస్తూ, తెలంగాణ లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, దుబ్బాకలో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని చూస్తున్న కెసిఆర్, పార్టీ శ్రేణులను దానికి అనుగుణంగా సిద్ధం చేస్తూ, ఎక్కడా ఎటువంటి లోటు పాట్లు లేకుండా, పార్టీ శ్రేణులంతా మూకుమ్మడిగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలు విజయం కోసం అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తూ ఉండడంతో, వారిపై పైచేయి సాధించేందుకు, ఇప్పటికే గ్రేటర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతలు మొత్తం మంత్రి హరీష్ కు అప్పజెప్పారు.
పార్టీ అభ్యర్థుల విజయానికి ఏ రకమైన ఇబ్బందులు లేవని అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు అకస్మాత్తుగా వరదలు రావడం, నగరాన్ని ముంచెత్తడం, వంటి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు టిఆర్ఎస్ మెడకు చుట్టుకొనేటట్టు కనిపిస్తున్నాయి.ఈ తలనొప్పి ఇలా ఉండగానే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో బ్లాస్టింగ్ జరగడంతో, ఇప్పుడు ఇదే అదునుగా, ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పై విమర్శలు మొదలుపెట్టాయి.
ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని టిఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవడం, ప్రస్తుతం నీటమునిగిన ప్రాజెక్టును చూసేందుకు విపక్షాల ప్రయత్నించడం, మార్గమధ్యంలోనే వారిని అరెస్టు చేయడం వంటి వ్యవహారాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సరిగ్గా కీలకమైన ఎన్నికల సమయంలోనే ఈ తతంగం అంతా మొదలు కావడంతో ఎన్నికలపై ఈ ప్రభావం కనిపిస్తుందేమో అని ఆందోళన ఇప్పుడు కేసీఆర్ ను వెంటాడు తోంది ఏదో రకంగా ఈ సమస్య నుంచి బయట పడి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో దాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.