తెలంగాణ సీఎం కేసీఆర్ లో గతంలో ఉన్న ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగులుతుండడం , పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరూ చేజారి పోతూ ఉండటం, జనాలలోను టిఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతూ ఉండడం ఇలా ఎన్నో అంశాలు చికాకు కలిగిస్తునే ఉన్నాయి.
పడిపోతున్న టిఆర్ఎస్ ప్రభుత్వ గ్రాఫ్ నిలబెట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ వరుసగా పర్యటనలు చేపడుతు అనేక హామీలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో కేసీఆర్ వ్యూహాలు అన్ని బాగా పనిచేశాయి.జనాల్లో సెంటిమెంటును రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.తెలంగాణలో బిజెపి బాగా బలం పెంచుకోవడం, దుబ్బాక, హుజురాబాద్ లో బిజెపి విజయం, పెద్ద ఎత్తున ఉద్యమ నేపథ్యం ఉన్న వారిని బిజెపి లో చేర్చుకోవడం వంటి వ్యవహారాలు టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోయినా, తమ ప్రభుత్వం పై అవినీతి విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు చేస్తూ ఉండడం ఇవన్నీ తమ గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.ఏది ఏమైనా 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా టిఆర్ఎస్ గెలిచేందుకు అవసరమైన వ్యూహాలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు.
దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పనితీరు పై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారట.ఈ మేరకు ఒక సర్వే సంస్థను కూడా రంగంలోకి దించినట్టు సమాచారం.
దుబ్బాక హుజురాబాద్ ఎన్నికలసందర్భంగా నిర్వహించిన సర్వే రివర్స్ కావడంతో ఆ సర్వే ను పక్కన పెట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారానే ఈ సర్వే చేస్తున్నట్లు సమాచారం .ఐ ప్యాక్ టీమ్ సర్వే తో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని కెసిఆర్ బలంగా నమ్ముతున్నారు.అందుకే ఆ టీమ్ ద్వారానే తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.ఈ సర్వే ఫలితాల అనంతరం అవసరమైతే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ తో అధికారికంగా ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారట.
ఇప్పుడు పీకే టీం చేపట్టబోయే సర్వే రిజల్ట్ ఆధారంగానే కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట.