కేసీఆర్ కనిపించడం లేదంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది.తెలంగాణలో కరోనా కేసులు గతంకంటే తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ వైరస్ కట్టడి చేసే విషయంలో కానీ, ప్రజలకు భరోసా కల్పించడంలో కానీ, అధికారులను ముందుండి నడిపించడంలో కానీ, అన్ని విషయాల్లోనూ ఇప్పుడు గతం కంటే కాస్త యాక్టివ్ గా ఉండి పని చేయాల్సిన కేసీఆర్ గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉండటం తో ఆయన వ్యవహార శైలిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా ప్రగతిభవన్ లో 30వరకు కరోనా కేసులు వచ్చాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.
తెలంగాణలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఆ సమయంలో కెసిఆర్ కనీసం వైద్యం పై సమీక్ష చేపట్టకుండా, ఎక్కడో దాక్కోవడం ఏంటి అని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
ప్రజలు ఇంత కష్టాల్లో ఉంటే, కేసీఆర్ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలంతా గమనించాలని ఆయన విమర్శించారు.పాత సచివాలయాన్ని కోవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని తాము కోరామని, పదివేల మంది రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నా, కేసీఆర్ దానిని పక్కన పెట్టి మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని, ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, మొదటి నుంచి కేసీఆర్ తప్పుడు విధానాలను పాటిస్తూ వస్తున్నారు అని విమర్శించారు. సీఎం వైఖరి కారణంగానే రాష్ట్రం ఈ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఉత్తమ్ విమర్శలు చేశారు.
కొత్త సచివాలయం కోసం పాత సచివాలయాన్ని హడావిడిగా కూల్చివేయడం వెనుక కారణాలు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
వాస్తు నమ్మకాల పిచ్చి కోసం విలువైన సచివాలయం కూల్చి వేస్తున్నారంటూ మరో నాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు.అసలు ఇంత హడావిడిగా సచివాలయాన్ని కూల్చడం వెనుక కారణాలు కూడా కాంగ్రెస్ నాయకులు విశ్లేషిస్తున్నారు.భవనాలు కూల్చివేత విషయంలో హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఈ భవనాలు కూల్చివేతలు మొదలుపెట్టారని , ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న సందర్భంగా అక్కడ ఎదురు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే హడావుడి పడుతున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు ఎత్తున విమర్శలు చేస్తున్న కేసీఆర్ మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.