తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.బిజెపి టిఆర్ఎస్ మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది.
తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళుతుంటే, కేంద్ర అధికార పార్టీ హోదాలో బీజేపీ నాయకులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తద్వారా వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ హవా తగ్గించి, తెలంగాణ గడ్డపైన బీజేపీ జెండా రెపరెపలాడించాలి అనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నట్లు వ్యవహరిస్తోంది.ఈ ఎత్తుగడను కనిపెట్టే బిజెపి దూకుడు కు అడ్డుకట్ట వేస్తూ, ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో కరోనా అంశం రాజకీయ దుమారం రేపుతోంది.ఇప్పటికే తెలంగాణలో తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారనే విమర్శలను టిఆర్ఎస్ ప్రభుత్వం మూటగట్టుకుంది.
అలాగే కేసు సంఖ్య తక్కువ చేసి చూపిస్తున్నారని, పెద్ద ఎత్తున రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేరుగా గవర్నర్ తమిళ సై ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ ఈ విధంగా దూకుడు ప్రదర్శించడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హెల్త్ సెక్రెటరీని రాజభవన్ ను రావాల్సిందిగా ఆదేశించారు.
అయినా వారు మాత్రం ఆ భేటీకి హాజరు కాలేదు.తాము మంగళవారం వస్తాము అంటూ కబురు పంపారు.
గవర్నర్ పిలిచినా అధికారులు సమావేశానికి వెళ్లకపోవడం వెనుక సీఎం కేసీఆర్ ఒత్తిడి ఉందని బిజెపి ఆరోపణలు చేస్తోంది.కెసిఆర్ హైదరాబాదులో అందుబాటులో లేని సమయంలో, గవర్నర్ ఉన్నతస్థాయి సమీక్ష లు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనతో ఈ సమీక్షకు అధికారులు వెళ్ళకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే కరోనా నివారణకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా గవర్నర్ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కరోనా విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆమెను కొంతమంది కోరారు.ఆ తర్వాత కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీకి గవర్నర్ పిలుపునిచ్చారు.ఈరోజు వారితో సమావేశం కూడా రాజ్ భవన్ లో జరగబోతోంది.ప్రస్తుత కరోనా వ్యవహారంలో గవర్నర్ దూకుడు గా ఉండడం, నేరుగా సమీక్షలు నిర్వహించడం పై కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.ముందు ముందు ఇది రాజకీయ దుమారం రేపే అవకాశం లేకపోలేదు.