మన శత్రువు బలహీనుడిగా ఉన్నంత కాలం మనం ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటుంది.అదే బలమైన శత్రువు విషయాని కొస్తే ఆ పప్పు లేమీ ఉడకవు.
అడుగడుగున మన వ్యవహారాలకు అడ్డుపడుతూ, అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు.సరిగ్గా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఇదే ఇబ్బంది ఎదుర్కొంటోంది.
మొన్నటి వరకు టిఆర్ఎస్ కు ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ పార్టీ ఉండేది.ఆ పార్టీని క్రమక్రమంగా బలహీనం చేయడంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేసి కాంగ్రెస్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాడు.
ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది.ఇక తమను అడుగడుగునా ప్రశ్నిస్తూ వచ్చిన కాంగ్రెస్ మరింత బలహీనం కావడంతో, కెసిఆర్ ఏ నిర్ణయాలు తీసుకున్న పెద్దగ ఇబ్బంది ఉండేది కాదు.
కానీ అనూహ్యంగా బిజెపి ఇప్పుడు ప్రధాన శత్రువుగా మారిపోవడంతో, టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.కేంద్ర అధికార పార్టీ బిజెపి అండ చూసుకుని తెలంగాణ బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని కి అడుగడుగునా అడ్డు పడుతూ, కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఇక మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు.
కొద్దిరోజులుగా ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో బిజెపి టిఆర్ఎస్ పై పోరాడుతోంది.పోనీ వీరి విషయంలో కఠినంగా వ్యవహరిద్దామా అంటే అసలే కేంద్ర అధికార పార్టీ ఎంపీలు కావడంతో, వీరు జోలికి వెళ్తే కేంద్రం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే అభిప్రాయంతో వెనక్కి తగ్గుతున్నారు.
ఇదే అదునుగా తెలంగాణలో బిజెపి చాపకింద నీరులా విస్తరిస్తూ, రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు తమ ప్రధాన శత్రువుగా ఉన్న కాంగ్రెస్ బలహీన పడటంతో, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని, బిజెపి తెలంగాణలో బలపడడానికి కారణం కాంగ్రెస్ బలహీనపడటం అని గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.కేవలం కాంగ్రెస్ చేసిన విమర్శలకు ఆయన స్పందిస్తూ, బీజేపీకి ఛాన్స్ ఇవ్వడం లేదు.
అలాగే ప్రభుత్వంపై ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తూ, కాంగ్రెస్ బలపడే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ బలపడినా, ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు కారణంగా తమకు పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని, అదే బిజెపి బలపడితే అది తమకు ఇబ్బంది అనే అభిప్రాయం కేసీఆర్ లో కలగడంతోనే, ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.