రాజకీయంగాను, వ్యక్తిగతంగాను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు కరోనాను కట్టడి చేసేందుకు కేసీఆర్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాయి.
కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనల కంటే అదనంగా మరిన్ని నిబంధనలు విధించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు.కానీ లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.దేశంలోని రెండు మూడు స్థానాల్లో తెలంగాణ ఉంది.
ఇటువంటి పరిణామాలతో టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోతున్నాయి.అదే సమయంలో హైకోర్ట్ సైతం ప్రభుత్వ తీరును తప్పు పడుతూ వస్తోంది.ఈ విషయంపై కేసీఆర్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రగతిభవన్ లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇదే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, కరోనా కేసుల విషయంలో తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 87 పిల్స్ దాఖలయ్యాయని, వాటన్నిటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ తీరును తప్పు పడుతోందని కేసీఆర్ బాధను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ సోకిన వారికి సకాలంలో వైద్య సేవలు అందిస్తూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వారు కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ ల కారణంగా, ఎక్కువ సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే కేటాయించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.దీని కారణంగా విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ, హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించడం బాధ కలిగిస్తోందని కేసీఆర్ అధికారుల సమక్షంలో తన బాధను వ్యక్తం చేస్తున్నారు.కరోనా విషయంలో ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, దక్కాల్సిన క్రెడిట్ కోర్టు కేసుల కారణంగా రావడం లేదని బాధలో కేసీఆర్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.