కేసీఆర్ ఏది చేసినా సరే దాంట్లో భవిష్యత్ రాజకీయ లబ్ధి అనేది కచ్చితంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు మరోసారి ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున వివాదాలు రాజుకుంటున్న సమయంలో ఆయన రీసెంట్ గా నరేంద్ర మోడీని కలవడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఇక జగన్ కూడా గతంలో చాలాసార్లు సీఎం హోదాలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విభజన కారణంగా తమ రాష్ట్రం నష్టపోయిందని, విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేసి ఆదుకోవాలంటూ ఎన్నో సార్లు కోరారు.కానీ దీనిపై పెద్దగా రెస్పాన్స్ మాత్రం రాలేదనే చెప్పాలి.
అయితే చాలావరకు విభజన చట్టంలో భాగంగా ఏపీకీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా వరకు రాకపోవడంతో ఏపీ ఇంకా ఆశగానే ఎదురు చూస్తోంది.దాంతో పాటే ఏపీకి న్యాయ బద్ధంగా రావాల్సిన వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకించి డెవలప్ మెంట్ నిధులు కూడా రావాల్సి ఉన్నా కూడా ఇంత వరకు రాలేదు.
ఇంకోవైపు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ హామీ కూడా నెరవేరలేదు.అయితే ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీలో మోడీని కలిసి రాష్ట్రాల విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన చట్టం అమలు చేయాలని కోరడం పెద్ద సంచలనమే రేపుతోంది.
ఎందుకంటే తెలంగాణ కంటే కూడా విభజన వల్ల నష్టపోయింది ఏపీ రాష్ట్రమే.తెలంగాణ రాష్ట్రం మిగులు నిధులతోనే ఏర్పాటు కావడం బాగా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.అయితే ఏపీ నష్టానికి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి చెప్పుకోదగ్గ హామీలు అమలు కాలేదు.అంతే కాదు పెద్ద ఎత్తున నిధులు వచ్చింది కూడా ఏమీ లేదు.
మరి ఇలాంటి తరుణంలో కేసీఆర్ తెలంగాణకు ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులు అడగడం ఏపీని షాక్ కు గురిచేస్తోంది.నష్టపోయిన తమకు ఇవ్వకుండా తెలంగాణకు ఎలా ఇస్తారంటూ వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.
ఏదేమైనా మరోసారి కేసీఆర్ రాజకీయాలను వేడెక్కించేశారు.