తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు ఎత్తులు మాములుగా ఉండవు.ఎవరిని ఎలా తన దారికి తెచ్చుకోవాలో , ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.
అందుకే సక్సెస్ ఫుల్ రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఎదుగుతున్నాడు.ప్రస్తుతం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలకు పదును పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూసి ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.కేసీఆర్ రగిలిస్తున్న ఈ సెంటిమెంట్ అస్త్రం తమకు బాగా కలిసివస్తుంది అని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్డులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ లో రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూనే తిరుగుతుంటాయి.ఇక్కడ అభ్యర్థులు ఎవరు అనే విషయాన్ని పక్కనపెట్టి కేసీఆర్ ని చూసే జనం ఓట్లేస్తారు అనే విధంగా పార్టీలో, ప్రజల్లో ఒకరకమైన భావన కలిగించి కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.
తాజాగా నల్గొండ సభలో మాట్లాడిన కేసీఆర్ ఎన్నికల తరువాత దేశాన్ని ప్రాంతీయ పార్టీలే పరిపాలించబోతున్నాయనీ, దానికి కోసం అవసరమైతే ఒక జాతీయ పార్టీ పెడతాను అంటూ ప్రకటించాడు.బీజేపీకి మొత్తంగా 150కి మించి సీట్లు రావనీ, కాంగ్రెస్ కి వంద దాటవని చెప్పాడు.
అందుకే టీఆర్ఎస్ కు16 ఎంపీ సీట్లు అందించాలని ప్రజలను కోరుతున్నాడు.మీరు తలుచుకుంటే మనం దేశ రాజకీయాలను మార్చేద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు ఏదో ఎన్నికల ముందే చేసి ఉంటే బాగుండేది కదా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులే అంటున్నారని, తన లక్ష్యం ఎన్నికలు కాదనీ దేశవ్యాప్తంగా ప్రజలు జీవితాలు మారాలని కేసీఆర్ అన్నారు.తెలంగాణ బిడ్డగా ఢిల్లీకి తనను పంపించాలని, అలా పంపుతారా అంటూ ప్రజలను అడిగి, సమాధానం వారితో చెప్పించారు.తెలంగాణ బిడ్డను ఢిల్లీకి పంపిస్తారా, జాతీయ రాజకీయాలు మనం చేద్దామా అంటూ ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు.మొత్తంగా చూస్తే కేసీఆర్ రగులుస్తున్న సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యేలాగే కనిపిస్తోంది.