తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులుకదుపుతున్నారు.రాజకీయంగా కేసీఆర్ బలంగా ఉండడం అదే సమయంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని నడిపించే సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ కీలక నాయకులతో పాటు ఎమ్యెల్యేలను టీఆర్ఎస్ లో వచ్చి చేరేలా కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాడు.
ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కీలక నాయకులు కూడా ఎవరికి వారు మానకొండుకులే అనే ధోరణి తప్ప చొరవ తీసుకుని పార్టీని బలోపేతం చేయలేకపోతుండడంతో కేసీఆర్ హవాకు అడ్డుకట్టపడడంలేదు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం తప్పును ఈవీఎంల మీద నెట్టి తప్పించుకున్నారు.
ఉత్తమ్ ఇప్పుడు చాలా సైలెంటయిపోయారు.ఎమ్మెల్యేలు పోతున్నా ఒక్క మాట మాట్లాడటం లేదు.సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు.ఎమ్మెల్యే లు వరుసపెట్టి టీఆర్ఎస్ లో చేరిపోతుండడంతో సీఎల్పీ నాయకుడు భట్టి నాయకత్వానికి ఇది పెద్ద సవాల్ గా మారింది.
రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతూనే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.రాహుల్ గాంధీ పర్యటనని కూడా తూతూ మంత్రంగా నిర్వహించారు.గెలిచిన 19 మందిని కూడా కాపాడుకోలేని దుస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.మిగిలిన వారిని కాపాడుకునే పరిస్థితి లేదు.
పార్టీ మారే వారిని ఎలా అపాలో కూడా అంతుబట్టడంలేదు.
ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బలహీనతలే తమ బలంగా చేసుకుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నాడు.తెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా తమకు ఎదురే లేకుండా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నాడు.టి.కాంగ్రెస్ లో ఏం జరుగుతున్నా ఎవరూ స్పందించలేని పరిస్థితి నెలకొంది.ఇదంతా కేసీఆర్ వ్యూహం ప్రకారమే జరుగుతోంది.
ఇప్పుడు తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.కానీ ఇంకా కాంగ్రెస్ అందుకు పూర్తిగా సన్నద్ధం అయినట్టుగా కనిపించడంలేదు.
టీఆర్ఎస్ మీద పోటీకి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించలేని పరిస్థితి నెలకొంది.ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్వయంకృపరాధమే అన్నట్టుగా కనిపిస్తోంది.