కాస్త లేటు అయినా ఎట్టకేలకు కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కు మంత్రిపదవులు ఇచ్చాడు.ముఖ్యంగా హరీష్ రావు విషయంలో కేసీఆర్ అనుసరించిన వైకిరిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తన కుమారుడు కేటీఆర్ కు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన పంచాయతీ రాజ్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖలనే ఈసారి కూడా కేటాయించగా హరీష్ రావు కు మాత్రం ఆర్థిక శాఖను అప్పగించారు.హరీష్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు యువజన సర్వీసుల మంత్రిగా, 2014లో కేసీఆర్ ప్రభుత్వంలో నీటి పారుదల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేటిఆర్ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా హరీష్ రావు ప్రాధాన్యం క్రమ క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.దీంతో హరీష్ రావు కేవలం సిద్దిపేటకే పరిమితం అయిపోయారు.
దీనిపై కేసీఆర్ కు అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి.
పార్టీ విషయాన్ని కాస్త పక్కన పెడితే హరీష్ రావుకు వ్యక్తిగతంగా ప్రజాభిమానం చాలా ఎక్కువ.అందరికంటే మంచి లీడర్గా ఆయనకు పేరు ఉంది.ఏదైనా మాటలతోనే కాదు, చేతులతోనే చూపిస్తాడని చాలామంది తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతారు.
ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాజెక్ట్లు పూర్తవ్వడానికి హరీష్ రావునే కారణమని, ప్రాజెక్ట్ల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని అందరికీ తెలుసు.అలాంటి ఆయనను రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది.
ఇదంతా కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ చేస్తున్నాడని జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది.ఇక తెలంగాణాలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్ దూకుడుకి లోక్సభ ఎన్నికలు బ్రేక్ వేశాయి.
ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటలైన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో పాటు రాజధాని హైదరాబాద్లో బీజేపీ పాగా వేసింది.దీనికి తోడు ఈటల రాజేందర్, రసమయి బాలకిషన్ వంటి నాయకులు పార్టీ అధినాయకత్వాన్నిప్రశ్నిస్తూ బహిరంగ వేదికల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఒక్కో నేత బహిరంగంగా వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధం అవుతుండడం కేసీఆర్ లో ఆందోళన బాగా పెంచింది.అందుకే రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా, పాలనాపరంగా అపార అనుభవమున్న హరీశ్రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
ప్రమాణ స్వీకార సమయంలో కేటీఆర్, హరీశ్ ఒకే కారులో రావడం, కేసీఆర్ ఇంట్లో ఆహ్వానం పలకడం, ప్రమాణ స్వీకార వేదిక మీద హరీశ్తో ప్రమాణం చేయించడం ఇవన్నీ తాము హరీష్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో తెలియజేసేందుకే ప్రయత్నించినట్టుగా అర్ధం అవుతోంది.