రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి దానికి అనుగుణంగా రాజకీయాన్ని రకరకాలుగా మలుపులు తిప్పగల సమర్థుడు తెలంగాణ సీఎం కేసీఆర్.మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, అదే పనిగా పొగడ్తలు కురిపించారు కేసీఆర్.
తెలంగాణ బీజేపీ నేతలతో రాజకీయ వైరం ఉన్నా, కేంద్ర బీజేపీ పెద్దలను పొగుడుతూ కేసీఆర్ స్టేట్మెంట్స్ ఇచ్చేవారు.కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని, ఆయన ముందు చూపుతో దేశంలో కరోనా తొందర్లోనే అంతం అవుతుందని, ప్రధానిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతాము అంటూ కేసీఆర్ హెచ్చరికలు చేశారు.
అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ స్వరంలో మార్పు మొదలయ్యింది.బీజేపీపైనా, ప్రధాని నరేంద్ర మోదీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
లాక్ డౌన్ విషయంలోనూ, వలస కూలీల ఇబ్బందులు తీర్చడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైందనేది దేశ ప్రజల మాట.మొదటిసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన విధించినప్పుడు కరోనాను కట్టడి చేసేందుకు ఇంతకు మించిన మార్గం లేదని దేశ ప్రజలంతా నమ్మరు.అందుకే కష్టమైనా భరిస్తూ మొదటి విడతలో సంతోషంగానే లాక్ డౌన్ ను ప్రజలు పూర్తి చేశారు.ఇక ఆ తర్వాత వరుసగా మార్చి 24 వ తేదీ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.
అయినా, కేసుల సంఖ్య ఇప్పుడు లక్ష దాటింది.దీంతో పాటు సుదీర్ఘకాలం నిబంధనలు పొడిగిస్తూ రావడం వల్ల ప్రజల్లో అసహనం తీవ్రంగా పెరిగిపోయింది.చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక వలస కూలీలు ఇప్పటికే వేలాది కిలోమీటర్ల నడక బాట పట్టారు.ఈ సందర్భంగా వారు పడుతున్న బాధలు ఇబ్బందులు మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మీడియా కూడా భారత్ లోని వలస కూలీలు ఇబ్బందులుపై కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
కరోనాను కట్టడి చేసే విషయంలోనూ, ప్రజల ఇబ్బందులు, వలస కూలీల బాధను తీర్చడంలోనూ, కేంద్రం విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది.తాజాగా కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల బడ్జెట్ కూడా అంకెల గారడీ తప్ప, రాష్ట్రాలకు జనాలకు ఒరిగేదేమీ లేదనే విషయం అందరికి అర్ధం అవ్వడంతో కేంద్రంపై జనాగ్రహం మరింతగా పెరిగిపోతోంది .సరిగ్గా జనం నాడిని పసిగట్టిన కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆ ఎఫెక్ట్ పడకుండా, అకస్మాత్తుగా మోదీపై విమర్శలు మొదలు పెట్టారు.కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ముష్టి అంటూ మండిపడుతున్నారు.పన్నుల సొమ్మును మీకు అందిస్తుంటే రాష్ట్రాలను బిచ్చగాళ్లు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.రాష్ట్రాలు డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్నాయి.జనం కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఈ సమయంలో జనాగ్రహం రాష్ట్రాలపై పడుతుంది.అందుకే కేసీఆర్ తెలివిగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై జనాగ్రహం రాకుండా, ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తే తప్పంతా కేంద్రానిదే అనే అభిప్రాయం జనాల్లో కూడా కలుగుతుందని కెసిఆర్ నమ్ముతున్నారు.
ఇప్పటికే ఆర్ధికవేత్తలు మోదీ తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు.అందుకే జనాల ముందుకు వచ్చేందుకు మోదీ కూడా వెనుకంజ వేస్తున్నారు.
ఈ సమయంలో కేంద్రంపై తాము ఎన్ని విమర్శలు చేసినా అటునుంచి ప్రతి విమర్శలు వచ్చే అవకాశం లేదని, దీంతోపాటు కేంద్రం తప్పులను ఎత్తి చూపిస్తున్నందుకు దేశవ్యాప్తంగా అందరి దృష్టి తమపైనే పడుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు.అందుకే ఇప్పుడు ప్రధానిని దోషిని చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారు.