పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది.మొన్నటివరకు తెలంగాణాలో టీఆర్ఎస్ కి తిరుగులేదు అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఆందోళన చెందుతున్నాడు.
దీనికి పార్టీలోనూ … ప్రజల్లోనూ పెరిగిపోతున్న వ్యతిరేకత ఒక కారణంగా కనిపిస్తోంది.టికెట్ల దక్కనివారు అసంతృప్తికి గురై పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం అవుతుండగా… టికెట్లు దక్కించుకున్న వారు ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్న నిరసన వెరిసి టీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతోంది.
ఆదివారం నాడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ పిలిపించి వారితో సమావేశమవడం, ప్రచార సరళిని తెలుసుకున్న తరువాత ప్రతీ గ్రామంలోనూ ప్రతీ ఓటర్ను అభ్యర్థులు ఖచ్చితంగా కలవాలన్న కేసీఆర్ సూచన కూడా అనేక అనుమానాలు కలిగిస్తోంది.
టీఆర్ఎస్ నాయకుల అసమ్మతి చల్లారకపోవడం, ప్రత్యర్థి పార్టీల బహిరంగ సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తాజా మాజీ శాసన సభ్యులకు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలు ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేత వారానికి రెండు బహిరంగ సభలు ఒకే రోజు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతుండడం, ఇక బీజేపీ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించడం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన పెంచుతోంది.
ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఉత్తర తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం, దీనితో పాటు 100 శాసనసభ నియోజకవర్గాల్లో స్వయంగా కేసీఆర్ బహిరంగ సభలకు హాజరు కావడానికి సిద్ధపడటం వంటివి పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడమే కారణమని తెలుస్తోంది.ఇప్పటికే సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్లో తొలి భారీ బహిరంగ సభ నిర్వహించి ఉత్తర తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించారని, వంద నియోజక వర్గాల్లో అధినేత ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు మరో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
ఇప్పటికే టికెట్లు పొందిన అభ్యర్థులు అటు పార్టీ కార్యకర్తల నుంచి ఇటు ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.
పార్టీ కార్యకర్తల నుంచి ఎదురైన అసంతృప్తిని చల్లార్చడానికి అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడంలేదు.చాలా మంది కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విముఖత చూపించడం అధిష్టానానికి మింగుడుపడడం లేదు.