మినీ మ్యానిఫెస్టోతో మరో వ్యూహాత్మక అస్త్రం సంధించారు కేసీఆర్.ఇప్పటికే లబ్దిదారులుగా ఉన్నవారిని, రెట్టింపు హామీలు ఇస్తూ… కాంగ్రెస్ వైపు మళ్లకుండా, తానే రెట్టింపు చేసి, ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అన్ని సభల్లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల రెట్టింపు వాగ్ధానాల కంటే, అంతకుమించి అన్నట్టుగా ప్రామిస్లిచ్చారు.ఒకరకంగా కాంగ్రెస్నే డిఫెన్స్లో పడేశారని విశ్లేషకులంటున్నారు.
ఇక టీఆర్ఎస్ మినీ మ్యానిఫెస్టోను బట్టి, కాంగ్రెస్, మహాకూటమి తిరిగి వండివార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.ఈ హామీలకు దీటుగా కూటమి రెట్టింపు హామీలు ఇప్పుడే ప్రకటిస్తే, పూర్తిస్తాయి ప్రణాళికతో కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఒకవైపు ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయి నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై మండిపడుతున్నాయి.ఇప్పటికే ఉన్న ప్రభత్వ పథకాలను మించేలా, మ్యానిఫెస్టోను వండివారుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్కీముల అస్త్రం వదిలారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.పాత పథకాలకు పదునుపెడుతూ, కొత్తవాటికి రూపకల్పన చేసే పనిలో పడ్డారు.మినీ మ్యానిఫెస్టోతో అన్నిరకాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.కాంగ్రెస్ కంటే మేము ఒక మెట్టు ఎక్కువే ఉంటాము అన్న కోణంలో కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తున్నారు.
ఆసరా పెన్షన్లు భారీగా పెంచుతామన్నారు కేసీఆర్.ఈ పెన్షన్లు రూ.2,016 చేస్తామని, 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ వర్తింపజేస్తామని, దివ్యాంగులకు పెన్షన్లు రూ.3,016 అందిస్తామని, నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని చెప్పి, ప్రతిపక్షాల కంటే, ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామని చెప్పకనే చెప్పారు.సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, ఇలా మినీ మ్యానిఫెస్టోతో ఊహించని వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్.ఎన్నికల ప్రణాళిక కమిటీకి వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చాయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు కేసీఆర్ చెబుతున్నారు.
అంతే కాదు కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింతగా బయటకు లాగుతామని చెబుతున్నారు.చంద్రబాబు వచ్చి, ఆంధ్రా-తెలంగాణ గొడవలు పెడదామనుకుంటున్నారని , తెలంగాణలో ఉన్నవాళ్లంతా, తెలంగాణవారేనని సెటిలర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్.