తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగయిపోయిందని అంతా అనుకుంటున్నారు.ఆ పార్టీలో ఒకే ఒక్క ఎమ్యెల్యే తప్ప మిగతా నాయకులంతా అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు.
కానీ ఆ మిగిలిన ఒకే ఒక్క ఎమ్యెల్యే అశ్వారావు పేట నుంచి ఎన్నికైన మచ్చ నాగేశ్వరరావు.తెలంగాణాలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు.
సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే అధికార పార్టీలోకి వెళ్లిపోగా అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాత్రం ససేమేరా అంటూ టీడీపీని వీడేందుకు ఇష్టపడడంలేదు.సండ్ర వీరయ్యతో పాటు నాగేశ్వరరావు కూడా పార్టీ మారిపోతారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అంటూ నాగేశ్వరావు ఖండిస్తూ వస్తున్నారు.
నాకు రాజకీయ జన్మ ఇచ్చిన టీడీపీని తాను వీడేది లేదంటూ చెబుతూనే తన ఆఖరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటానని చెబుతూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లాలో ఏన్కూరు ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది.ఎంపీపీ వరలక్ష్మితో పాటు అక్కడ ఎంపీటీసీలుగా గెలిచిన టిడిపి నాయకులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు సన్మానించారు.
ఇంత సంక్షోభ పరిస్థితుల్లో కూడా టిడిపి అక్కడ ఎంపీపీ గెలుచుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ ను.అందుకే టీడీపీ స్పీడ్ కు బ్రేక్ వేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ నాగేశ్వరరావును పార్టీలో చేరాల్సిందిగా ఆయన మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
ఎట్టి పరిస్థితితుల్లోనైనా ఆయన్ను పార్టీలోకి తీసుకురావాల్సిందిగా ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, టీడీపీ నుంచి వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు ఆ బాధ్యతలు అప్పగించారట.అంతే కాదు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరితే నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు కూడా ఇస్తానని హామీలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.ఇదే విషయంపై మచ్చ నాగేశ్వరరావు స్పందిస్తూ మీరు పార్టీ మారాలని ఎంత ఒత్తిడి చేసినా తాను లొంగనటూ చెప్పారట.
అంతేకాదు తాను ఎప్పటికీ పార్టీ మారనని, టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఎప్పుడూ అండగా ఉంటానని తేల్చిచెప్పారట.