హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద హడావుడి చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోతే తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి అనేది కెసిఆర్ లో కలుగుతున్న భయం.
ఇక్కడ బిజెపి నుంచి బలమైన అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టు ఉండడం ఇవన్నీ కేసీఆర్ కు టెన్షన్ కలిగిస్తున్నాయి.
అందుకే వివిధ సర్వేలు , ఇంటలిజెన్స్ రిపోర్ట్ సహకారంతో హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు పై సర్వే చేయించగా, దళిత సామాజిక వర్గం ఓటర్లు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, వారంతా ఈటెల రాజేందర్ వైపు మొగ్గుచూపుతున్నారని రిపోర్టులు రావడం తదితర కారణాలతో ఆ సామాజిక వర్గం ప్రజలను ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
తెలంగాణ అంతటా ఈ దళిత బందును అమలు చేస్తామని, పైలెట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో మాత్రమే దీనిని అమలు చేస్తామని కెసిఆర్ ప్రకటించడమే కాకుండా ఈ నెల 16న జరిగిన సభలో దళిత బంధు పథకం ను అధికారికంగా ప్రారంభించేందుకు కొంత మంది లబ్ధిదారులకు కుటుంబానికి 10 లక్షల చొప్పున ప్రకటించడమే కాకుండా, ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు ఈ పథకం వర్తింప చేస్తాము అంటూ మరో సంచలన ప్రకటన చేశారు.
దీంతో కెసిఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత సామాజిక వర్గం నుంచి మంచి ఆదరణ పెరిగిందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు.
అయితే హుజురాబాద్ ఎన్నికలను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం, ఈ ఎన్నికల ఫలితాలే సార్వత్రిక ఎన్నికల గెలుపు ను డిసైడ్ చేస్తాయి అనేది కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది.అందుకే దళిత బంధు పథకం వరకు మాత్రమే సరిపెట్టకుండా, అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా వివిధ పథకాలను రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.తాజాగా చేనేత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాలను అమలు చేస్తే మళ్ళీ తమ కు తిరుగు ఉండదనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సామాజిక వర్గాల వారికి కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేసే అలోచన లో కేసీఆర్ ఉండడం తో, తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.