తిమ్మిని బమ్మి చేసైనా తాను అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్నట్టుగా చేరుకోవడం లో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధహస్తులు.తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చూసుకుంటే, ఇప్పటి వరకు ఒక వ్యూహం ప్రకారమే నడుచుకుంటూ, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూనే వస్తున్నారు.
అప్పుడప్పుడు చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినా, ఎక్కువగా విజయాల్ని నమోదు చేసుకున్నారు.పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ వ్యూహాలే అస్త్రాలుగా పనిచేశాయి.
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ కు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.ఇక్కడ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారింది.
తమతో ఉద్యమ కాలం నుంచి నడిచిన ఈటెల రాజేందర్ బలమైన వ్యక్తి కావడంతో కెసిఆర్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో రాజేందర్ కు ఉన్న బలం బలగం ఏమిటో కేసిఆర్ కు బాగా తెలుసు.
అందుకే ఇంతగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ నియోజకవర్గంలో మోహరించి, వేలకోట్ల రూపాయల తో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి, ఈ నియోజకవర్గం ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నారు.గ్రామాల వారీగా, మండలాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలను ఇంచార్జీలుగా నియమించారు.
ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులు అందరినీ తనవైపుకు తిప్పుకునే పనిలో ఉన్నారు.రాజేందర్ ను ఒంటరి చేసి ఓడించగలిగితేనే ఇక భవిష్యత్తులోనూ ఆయనతో తమకు ఇబ్బంది ఉండదని ఒకవేళ రాజేందర్ గెలిస్తే టిఆర్ఎస్ కు ఇప్పుడే కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కెసిఆర్ అభిప్రాయం.అందుకే ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులు అందరినీ టిఆర్ఎస్ వైపు ఉండేలా చూసుకుంటూ, వారికి కీలకమైన పదవులు కట్టబెడుతున్నారు.పూర్తిగా పరిస్థితి తమకు అనుకూలంగా ఉండేలా చేసుకుంటూ సరికొత్త వ్యూహాలతో ఈ నియోజకవర్గంపై కేసీఆర్ దృష్టి సారించారు.
ఇక్కడ సక్సెస్ అయితే, రాబోయే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదు అనే ఉద్దేశం తో కేసిఆర్ ఇంతగా ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారు.