సెంటిమెంట్ రాజకీయాలు పండించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధహస్తులు .టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే సెంటిమెంటు, సానుభూతి పై.
ఆ విధంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి అధికారంలోకి రెండుసార్లు రాగలిగారు అంటే ప్రజల్లో సెంటిమెంటును ఓట్ల రూపంలో రాబట్టి సక్సెస్స్ కావడమే.అయితే ఈ సెంటిమెంట్ రాజకీయం దుబ్బాక ఉప ఎన్నికలలో వర్కౌట్ కాక పోవడం కేసీఆర్ ను, ఆ పార్టీ నాయకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఆ ఫలితం ఎఫెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనూ కనబడటంతో మరింత కంగారుగా టీఆర్ఎస్ ఉంది.తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని టిఆర్ఎస్ గుర్తించింది.అందుకే నష్ట నివారణ చర్యలకు సైతం దిగి , పట్టు చేజారిపోకుండా చూసుకునే పనిలో ఉంది. మళ్లీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రక్రియ మొదలవడం, ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఎన్నికలు రావడంతో మొన్నటివరకు అభ్యర్థిని నిలబెట్టాలనే విషయంలో కేసీఆర్ చాలా కసరత్తు చేశారు.
సెంటిమెంట్ వర్కౌట్ కాక పోవడంతో నాగార్జున సాగర్ లో కొత్త అభ్యర్థిని పోటీకి దించాలని చూశారు.కానీ చివరకు నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భరత్ ను సాగర్ అభ్యర్థిగా ఎంపిక చేసి బీ ఫారమ్ అందించారు.
నోముల భరత్ విద్యావంతుడు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో పేరు ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉండడం తో పాటు, నోముల నరసింహయ్య పేరు ప్రఖ్యాతలు టిఆర్ఎస్ గెలుపు నకు దోహదం చేస్తాయని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.
అదీ కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడడంతో ఆ ప్రభావం సాగర్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పై పడుతుందని, అలాగే కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కారణంగా ఇక్కడ బిజెపి కి ఎదురు దెబ్బ తగులుతుందని, ఖచ్చితంగా టిఆర్ఎస్ అభ్యర్థి భరత్ గెలుస్తాడు అనే నమ్మకం పెట్టుకున్నారు.కొద్ది నెలల క్రితం దుబ్బాక లో సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇచ్చినా, ఆమె పెద్దగా జనాలకు తెలియక పోవడం, వాక్చాతుర్యం లేకపోవడం వంటివి ఇబ్బందికరగా మారాయి అని, అప్పట్లో బిజెపి కి జనాల ఆదరణ ఉండడం వంటి వాటితో నష్టపోయామని, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని, సాగర్ అభ్యర్థి భరత్ విద్యావంతుడే కాకుండా వాక్చాతుర్యం కలిగిన నాయకుడు గాను నియోజకవర్గ ప్రజలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో, ఇక్కడ గెలుపు తమకే దక్కుతుందని కేసిఆర్ అంచనా వేస్తున్నారు.