తెలంగాణలో తమకు రాజకీయ శత్రువులు పెద్దగా ఎవరూ లేరని, ఇప్పుడూ, ఎప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉంటుంది అని భావిస్తూ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక సీఎం బాధ్యతలు తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించి, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తూ వచ్చారు.అయితే అనూహ్యంగా తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బతినడం, ఎప్పుడు గెలుపు తమదే అనే ధీమా పోవవడం, పార్టీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇప్పటి వరకు అంతంతమాత్రంగానే ఉంటూ, తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతూ వచ్చిన బిజెపి ఒక్కసారిగా బలం పెంచుకోవడం వంటివి అన్నీ లెక్క వేసుకుంటున్న కెసిఆర్ రానున్న రోజుల్లో బీజేపీతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గుర్తించారు.అందుకే ఇప్పటి వరకు ఉన్న అన్ని మోహమాటలను పక్కనపెట్టి మరింత బలోపేతం కాకపోతే , ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు.
దీనిలో భాగంగానే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని కెసిఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ముఖ్యంగా నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన తన కుమార్తె కవిత కు మంత్రి పదవి ఇచ్చే నిమిత్తం కెసిఆర్ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.అదీ కాకుండా, ఇటీవల కాలంలో చాలా మంది మంత్రుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.అనేక మంది ప్రజా ఆగ్రహం ఎదుర్కోవడంతో పాటు, పార్టీకి ప్రభుత్వానికి వారి వల్ల ఉపయోగం లేకుండా పోవడం, అలాగే కొంతమంది నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ ఆశించిన స్థానాల కంటే తక్కువ స్థానాలు సంపాదించిందనే విషయంపై కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు.
అటువంటి మంత్రులను తప్పించి, వారి స్థానంలో ఉత్సాహంగా ఉంటూ పార్టీకి కలిసి వచ్చే వారికి మంత్రి పదవులు కేటాయించాలని, దీని ద్వారా బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడంతో పాటు, పెద్ద ఎత్తున ఆ పార్టీపై విమర్శలు చేయగల వాక్చాతుర్యం ఉన్న వారిని ఎంపిక చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా మంత్రుల పనితీరు పైన , వారికి పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టు, వారికి సంబంధించిన సమగ్ర వివరాలను రిపోర్టు రూపంలో తెప్పించుకున్నారట.
దాని ఆధారంగా పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే నిమిత్తం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్యాబినెట్ ప్రక్షాళన సమయంలోనే కేటీఆర్ కు సీఎం గా ప్రమోషన్ కల్పిస్తారా లేదా అనే విషయం పైన ఇప్పుడు టిఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.