టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ టెన్షన్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.పూర్తిగా ఆ నియోజక వర్గాన్ని టార్గెట్ చేసుకుని అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ, పార్టీకి చెందిన అనేకమందిని ఇన్చార్జిలు గానూ నియమించారు.
సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువగా హుజూరాబాద్ నియోజకవర్గం పై కేసీఆర్ దృష్టి పెట్టారు.ఇక్కడ గెలుపోటములు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది డిసైడ్ చేసే అవకాశం ఉండడంతో, కేసీఆర్ ఇంతగా టెన్షన్ పడుతున్నారు.
అదీ కాకుండా ఈ నియోజకవర్గంలో బలంగా పాతుకుపోయిన ఈటెల రాజేందర్ వంటి వారిని ఢీ కొట్టడం అంటే ఆషామాషీ కాదని, కెసిఆర్ కు బాగా తెలుసు.
అందుకే దళిత బంధు వంటి భారీ బడ్జెట్ పథకాలను ప్రవేశపెడుతూనే, సామాజిక వర్గాల వారీగా తమ పార్టీకి మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు.
అయితే ప్రధానంగా టిఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయం లో ప్రతిష్టంభన ఏర్పడింది.ఇక్కడ ఎవరిని పోటీకి దింపాలనే విషయంలో కేసీఆర్ సైతం ఎక్కువగానే టెన్షన్ పడుతున్నాడట.
ఇప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిజెపి నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎల్ రమణ, స్వర్గం రవి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి వంటి వారి పేర్లు ఫైనల్ గా పరిశీలనలోకి రాగా, కేసీఆర్ మాత్రం రెండు పేర్లను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవి పేర్లను పరిశీలిస్తున్నారు.ఈ ఇద్దరూ బలమైన వ్యక్తులు కావడం, సామాజికంగా, ఆర్థికంగా ఈటెలను ఢీ కొట్టగల స్థాయి ఉన్న వారు కావడంతో, ఈ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం తాము నిర్వహించిన సర్వేల ఆధారంగా స్వర్గం రవికి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నట్లు కెసిఆర్ కు నివేదిక పంపించడంతో, స్వర్గం రవి పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
సర్గం రవి కాంగ్రెస్ నేతగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే.హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్తగానూ ఆయన ఉన్నారు.దీంతో ఆయన టిఆర్ఎస్ అభ్యర్థిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.