హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికీ సరైన క్లారిటీ రాలేదు.బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఫైనల్ కాగా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని వెతుక్కునే పనిలో ఉంది.
ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎంతో మంది నేతలు పోటీపడుతున్నారు.టిఆర్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు, ఈటెల రాజేందర్ గెలవకుండా చూసేందుకు ఎంతగానో శ్రమిస్తోంది.
దీంతో అందరి దృష్టి హుజూరాబాద్ నియోజకవర్గం పై పడడంతో , ఇక్కడి నుంచి పోటీ చేస్తే మంచి గుర్తింపు వస్తుందనే ఆలోచనలో చాలా మంది టిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు.హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో, సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలనేది కేసీఆర్ అభిప్రాయం. అందుకే హుజురాబాద్ లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దాదాపు 200 మంది ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు గా ఐదుగురు పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
వీరిలో పాడి కౌశిక్ రెడ్డి, స్వర్గం రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ముద్దసాని మాలతి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేర్లు ఫైనల్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ ఐదుగురిలో ఎవరిని పోటీకి దింపితే ఈటెల పై విజయం సాధించగలరు అనే విషయంపై కెసిఆర్ సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఆ సర్వే నివేదిక లతోపాటు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అభ్యర్థిని ఎంపిక చేసి ఇక్కడ గెలవాలనేది కెసిఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది.
మరో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఓ వారం లోగా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత పూర్తిగా హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి సారించి , టిఆర్ఎస్ అభ్యర్థి ద్వారా నియోజకవర్గంలో పాదయాత్ర చేయించే విధంగా కెసిఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .ఇప్పటికే మండలాల వారీగా హుజూరాబాద్ నియోజకవర్గం లో మంత్రులు, ఎమ్మెల్యేలను కెసిఆర్ ఇన్చార్జిలుగా నియమించారు.ఇక్కడ రాజేందర్ కు పట్టు దొరకకుండా చేసేందుకు అన్ని రకాల ఎత్తుగడలను వేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదుగురు అభ్యర్థులతో పాటు మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.