హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు.ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు.
ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం లోనే కాకుండా, మిగతా కొన్ని చోట్ల ఈ పథకాన్ని అమలు చేశారు.
రాష్ట్రమంతా దీనిని అమలు చేసి తెలంగాణ లో ఇక టిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలంటే దాదాపు లక్ష కోట్లకు పైగా నిధులు అవసరం.
అయినా కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఏదో విధంగా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించారు.
ఇప్పటికే హుజురాబాద్ లో తొలి దశలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలను ఎంపికచేసి పథకాన్ని అమలు చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో ఉన్న దళిత సామాజిక వర్గం ఓట్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు దీనిని ప్రవేశ పెట్టినా, ఇప్పుడు మిగతా సామాజిక వర్గాల నుంచి కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది.
దళిత బంధు తరహాలోనే అన్ని సామాజిక వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ ఉంది.తెలంగాణలో దళిత బందు తరహాలోనే బిసీ సిబ్బంది కూడా అమలు చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ అంశం పైన కేసీఆర్ కు లేఖ రాశారు.తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.దళిత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా, మిగతా సామాజిక వర్గాలకు అమలు చేయకపోవడం పై మాత్రం ఆయా సామాజిక వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.ఇది మరింత ముదిరితే 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తోంది.
టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు సైతం దీనిని హైలెట్ చేసుకుని రాజకీయ మైలేజ్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.మరి దీనిని కేసీఆర్ ఏ విధంగా తిప్పి కొడతారో ?
.