ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ అధిష్టానం ఏ విషయం తేల్చుకోలేని సందిగ్ధంలో పడింది.ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసారు.
ఇక పార్టీ నుంచి ఆయనను బహిష్కరించడం ఒక్కటే మిగిలి ఉంది.కానీ ఆ విషయంలో ముందుకు వెళ్లలేక పోతున్నారు.
పోనీ ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తారా అంటే ఆయన సైతం ఈ విషయంలో ఎటు తేల్చడం లేదు.ఇప్పటికే ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారని, అవినీతి అక్రమాలు చేశారని నిరూపించేందుకు టిఆర్ఎస్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఐఏఎస్ ల తో కమిటీని నియమించింది.ఈ వ్యవహారం కాక రేపుతోంది .ఇక ఈటెల సైతం ఈ విషయంలో తగ్గేలా కనిపించడం లేదు .ఆయన తాను కెసిఆర్ స్థాయి వ్యక్తిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ కు రావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వంటివి ఎన్నో జరిగిపోయాయి.
ఈటెల కు మద్దతుగా వేలాది మంది బయటకు రావడం ఆయనకు మద్దతుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం ఇవన్నీ టిఆర్ఎస్ లో కాస్త కంగారు పుట్టిస్తున్నాయి.
ఈ సమయంలో ఈటెల ను పార్టీ నుంచి తాము బహిష్కరిస్తే, ఆయనపై తెలంగాణ ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని గ్రహించిన కెసిఆర్ ఈటెల స్వయంగా రాజీనామా చేసే విధంగా పరిస్థితులు కల్పిస్తున్నారు.అంతేకాదు తాను గతంలో చెప్పిన టీఆర్ఎస్ ఓనర్లం అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
గజ్వేల్ నుంచి కేసీఆర్ రాజీనామా చేసి తనపై గెలవాలి అంటూ ఈటెల సవాల్ చేస్తున్నారు.అక్కడ గెలిచిన వారే టిఆర్ఎస్ ఓనర్లు అనే వాదనను తెరపైకి తెచ్చారు.
దీంతో ఆత్మరక్షణలో పడిన టిఆర్ఎస్ ఈ విషయంలో వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ఈటెల పై ప్రజల్లో సానుభూతి పెరగకుండా ఆయన ప్రభావాన్ని ఏవిధంగా తగ్గించాాలి అనే విషయంపై ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటెల ను దెబ్బకొట్టేందుకు ముందుగా ఆయన చుట్టూ ఉన్న ప్రధాన అనుచరుల వ్యవహారాలపై దృష్టి పెట్టి ఇబ్బందులు సృష్టించాలని, వారి ఆర్ధిక కార్యకలాపాలతో పాటు, వారిపై కేసులు, తదితర విషయాలపైన పూర్తిగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.ఏదో విధంగా ఈటెల ను ఒంటరి చేసి అప్పుడు తమ వ్యూహం నెరవేర్చుకోవాలని పట్టుదలగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.