టిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం విలీనం కావడం పెద్ద సంచలనమే రేపింది.అసలు టిడిపికి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య చాలా కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.
కానీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టిడిపి లోనే ఉంటాను అంటూ, మొదటి నుంచి చెబుతూ వచ్చారు.కానీ అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేసేసారు.
అయితే ఆకస్మాత్తుగా ఈ విలీనం ప్రక్రియ చోటు చేసుకోవడానికి కారణం ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.అయితే దీని వెనుక టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
అయితే ఇదంతా వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.అసలు షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు వెనుక కెసిఆర్ ఉన్నారనే విషయం చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.
గతంతో పోలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో, ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకు షర్మిల పార్టీని తెరపైకి తెచ్చారనే ఊహాగానాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.షర్మిల పార్టీ ఏర్పాటు పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్న, టిఆర్ఎస్ నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.
మామూలుగా అయితే ఆంధ్ర పార్టీ అంటూ పెద్దగా హడావుడి చేయాల్సిన టిఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఈ విషయంలో నోరు మెదపకపోవడం, మరో ఆంధ్ర పార్టీ పెత్తనం అంటూ షర్మిల పార్టీపై వ్యతిరేకత పెరగకుండా టిఆర్ఎస్ లో టిడిపి విలీన ప్రక్రియ పూర్తి చేసినట్టుగా అనేక అనుమానాలు నెలకొన్నాయి.
టీడీపీ విలీనం ప్రక్రియ పూర్తి కావడం తో టిడిపిలో ఉన్న వారు, టీఆర్ఎస్ లో చేరేందుకు ఇష్టపడని ఇతర పార్టీల్లోని నేతలు షర్మిల పార్టీ వైపు వస్తారు అని, దీని కారణంగా టీఆర్ఎస్ కు ఏ ఇబ్బంది ఉండదు అని కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ ను తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.