గత కొంత కాలంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వైఖరిపై చర్చ జరుగుతోంది.ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలు, ఆయన వ్యూహాలు పరిశీలిస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి .గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో కెసిఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమైపోయే వారు. కెసిఆర్ ఇప్పుడు మాత్రం జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.అలాగే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం తగ్గించి వారు చేసే విమర్శలను సీరియస్ గా తీసుకుని వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. పదేపదే నిరుద్యోగ సమస్యపై షర్మిల తో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకులు విమర్శలు చేస్తుండడంతో, పెద్ద ఎత్తున ఉద్యోగాలు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.అలాగే ఎస్సీ ,ఎస్టీ ,బిసి సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇదంతా 2022 లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.సాధారణంగా 2023 లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
అయితే అప్పటికి ప్రతిపక్షాలు బలం పుంజుకుంటాయని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రతిపక్షాలు బలపడే చాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.వచ్చే ఏడాది ఆగస్టు 15 తర్వాత కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేయబోతున్నారని, ఇది రాసిపెట్టుకోండి అంటూ రేవంత్ సవాల్ చేస్తున్నారు.అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయరు అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
రేవంత్ ఇంతగా సవాల్ చేయడానికి కారణం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఖచ్చితమైన సమాచారం ఆయన వద్ద ఉండబట్టే ఇంత గట్టిగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అనే విషయం అర్థమవుతోంది.