ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల దృష్ట్యా అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
ఈ వేడి ఇలా కొనసాగుతుండగానే అకస్మాత్తుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టడంతో ఈ ఊపు మరింతగా పెరిగింది.బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే పోటీ నెలకొంది.
బీజేపీ, కాంగ్రెస్ మూకుమ్మడిగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నాయి.హుజురాబాద్ లో గెలుపు కోసం టీఆర్ఎస్ భారీగానే కసరత్తు చేస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ అక్కడే మకాం వేసి టిఆర్ఎస్ కు విజయం దక్కేలా ప్రయత్నం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం అవుతుండడం ఆ పార్టీని కంగారు పెడుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నెన్నో హామీలు ప్రజలకు ఇచ్చారని, కానీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పూర్తిగా ఆ సంగతి పక్కన పెట్టేసారని ఆరోపిస్తూ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకులంతా ఒక వేదికపైకి వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ నివాసంలో ఇటీవలే ఉద్యమకారులంతా సమావేశమై చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ నేత ఇన్నయ్య, స్వామి గౌడ్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సాదానంద్, రవీంద్ర నాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు.కెసిఆర్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమకారులంతా ఒకే వేదికపైకి వచ్చేందుకు సిద్ధమవ్వాలి అని ఆయన పిలుపు ఇస్తున్నారు.హుజురాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
దీనిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు అంతా సమావేశం అయ్యి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇక పూర్తిగా హుజురాబాద్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు మర్చిపోయి ఉద్యమకారులను ఎలా వేధిస్తుందో తదితర అంశాలపై నియోజకవర్గం ప్రజలకు అర్థమయ్యేలా, టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తీరు ఆ పార్టీ శ్రేణులో మరింత ఆందోళన పెంచుతోంది.అనుకోని ఉపద్రవంలా ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఊహించని కేసీఆర్ ఈ పరిణామాలపై ఆదోళనలో ఉన్నట్లు సమాచారం.