తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం… ముక్కుసూటిగా మాట్లాడుతూనే అందరిని ఆకట్టుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సంచలనాలకు తెరతీస్తున్నాడు.కేంద్రం జమిలి ఎన్నికలు తీసుకొచ్చేందుకు సిద్ధం అవ్వడంతో కేసీఆర్ లో ఎన్నికల ఆశలు చిగురించాయి.
అయితే ఆ తరువాత ఆ ప్రతిపాదన అటకెక్కడంతో అసెంబ్లీ రద్దు చేయించి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆరాటపడుతున్నాడు.దానికి అనుగుణంగానే కొంతకాలంగా ఢిల్లీ చుట్టూ చెక్కెర్లు కొడుతూ … ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో 25 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
దేశంలోనే ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ప్రగతి నివేదన సభ ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.రేపు జరగబోతున్న సభకు సర్వం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పెరుగుతోంది.దీన్ని మరింత పెంచేలా ఉంది క్యాబినెట్ భేటీ నిర్ణయం! కొంగర కలాన్ సభకు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు మంత్రివర్గ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
దీంతో అసెంబ్లీ రద్దు తీర్మానమే మంత్రి వర్గ భేటీలో కీలకం కాబోతోందా అనే చర్చ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఒకవేళ అసెంబ్లీ రద్దు తీర్మానం చేస్తే దాన్ని గవర్నర్ కు అందించేసి ఆ తరువాత అటు నుంచే సభకు వచ్చి, తాము ఎన్నికలకు వెళ్తున్నామనే ప్రకటన చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాంలతోపాటు తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచనలు అందాయని అప్పటి నుంచే కేసీఆర్ లో కంగారు బాగా పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి.దీనికి తోడు జాతకాలు జోతిష్యం బాగా నమ్మే కేసీఆర్ వాటి ప్రకారమే ఈ సంవత్సరంలోనే ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ సభపై ఆ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.