తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఫోకస్ అంతా ఇప్పుడు ఏపీ మీద పెట్టాడు.తన రాజకీయ బద్ధ శత్రువైన చంద్రబాబు నాయుడు ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోకుండా చేయాలనే తలంపుతో వైసీపీ కి మద్దతుగా ఆయన అనేక వ్యూహాలు పన్నుతూ తనవంతు సహకారం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక జనసేన పార్టీ కూడా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న పార్టీనే అని అనుమానం వ్యక్తం చేస్తున్న కేసీఆర్, పనిలో పనిగా ఆ పార్టీకి కూడా మైలేజ్ పెరగకుండా చేసేపనిలో పడ్డాడు.దీనిలో భాగంగానే పవన్ ఇటీవల తీసుకున్న ఓ రాజకీయ వ్యూహానికి కేసీఆర్ చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
కొద్దీ రోజుల క్రితం లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత మాయావతిని పవన్ కలవడం ఆ పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకోవడం ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం జరిగిపోవడంతో కేసీఆర్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలనే టీడీపీ, జనసేన పార్టీలు రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నాయాని దీనిలో భాగంగానే చంద్రబాబు సూచనలతోనే పవన్ బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నాడని, ఏపీలో దళిత, బీసీ, మైనార్టీ ఓట్లను వైసీపీకి దూరం చేసేందుకు ఈ పొత్తు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.ఆ సామజిక వర్గాల ఓట్లను చీల్చడం ద్వారా చంద్రబాబు నాయుడికి మేలు చేసేందుకే మాయావతితో చేతులు కలిపేందుకు పవన్ కల్యాణ్ యుపీ వెళ్లారని వైసీపీ కూడా ఆరోపణలు చేస్తోంది.అందుకే కేసీఆర్ రంగంలోకి దిగి ఏపీలో గెలిచేది, లోక్ సభకు ఎక్కువ మంది ఎంపీలు తీసుకువచ్చేది వైసీపీ అధినేత జగన్ మాత్రమేనని, చంద్రబాబు సూచనలతోనే పవన్ ఇప్పుడు మీ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యాడని దీనివలన మీకు కలిసివచ్చే అంశం ఏదీ లేదని కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది.
జనసేనకు ఏపీలో కనీసం ఒక్క ఎంపీ స్ధానం కూడా రాదని, భవిష్యత్ లో వారి నుంచి మీకు ఎలాంటి మేలు జరుగదని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని స్నేహ హస్తం చాచాడంపై పునరాలోచించాలని కేసీఆర్ సూచించారట.అయితే కేసీఆర్ చెప్పిన విషయాలపై మాయావతి పునరాలోచనలో పడ్డారట.ఏపీలో వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు మాయావతి తమ పార్టీ నేతలను ఏపీకి పంపబోతున్నట్టు సమాచారం.