తెలంగాణ సీఎం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నా అది సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది.మొదటి నుంచి ఇది టిఆర్ఎస్ లో చూస్తున్న, అమలవుతున్న వ్యవహారమే.
తాజాగా తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను కెసిఆర్ ఎంపిక చేశారు.ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు రెండోసారి అవకాశం ఇచ్చారు.
కేశవరావుకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని మొదటి నుంచి అందరూ అంచనా వేసిన సంగతి తెలిసిందే.ఇక రెండో స్థానం పై చాలామంది కీలక నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
కెసిఆర్ తప్పకుండా తమకే అవకాశం ఇస్తారు అంటూ చివరి వరకు చూసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి.
వారిలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఫైనల్ అయిందని ప్రచారం పెద్దఎత్తున జరిగింది.కానీ ఆయనకు అవకాశం దక్కలేదు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమైన పొంగులేటి చివరి నిమిషంలో కెసిఆర్ ఆ సీటు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టడం తో ఆయన ఆశలకు బ్రేక్ పడింది.అప్పట్లోనే పొంగులేటికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని కెసిఆర్ హామీ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ఆ హామీ నెరవేరలేదు.అలాగే కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత కూడా రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని అందరూ అంచనా వేసిన ఆమెకు కూడా అవకాశం దక్కలేదు.
వీరే కాకుండా కడియం శ్రీహరి తదితర నేతలు రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురు చూపులు చూశారు.కానీ ఎవరూ ఊహించని విధంగా ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కి కెసిఆర్ అవకాశం కల్పించారు.
దీనికి ఆ సొంత జిల్లా నేతలు కూడా గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరే సమయంలో సురేష్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.ఆ మేరకు ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కినట్లు గా తెలుస్తోంది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కవిత తో పటు కడియం శ్రీహరి మధుసూదనాచారి ఇలా చాలా మంది సీనియర్ నాయకులకు మొండిచేయి చూపిన కేసీఆర్ అనూహ్యంగా సురేష్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో కెసిఆర్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి అంటూ సీనియర్ నాయకులు నిట్టూర్చుతున్నారు.
అయితే ఎక్కడ తమ అసంతృప్తిని బయటపెట్టకుండా సదరు నాయకులు జాగ్రత్త పడుతున్నారు.