మొన్నటి వరకు ఒక లెక్క … ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.రేవంత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే దూకుడుగా ఉంటూ, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ కేటీఆర్ వ్యవహారాలపై నానా రాద్దాంతం చేస్తూ , నానా హంగామా సృష్టించేవారు.
ఆ హంగామా అలా రచ్చగా మారినా, కెసిఆర్ మాత్రం రేవంత్ ను పెద్దగా పట్టించుకునేవారు కాదు.దీనికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడమే.
అయితే కొద్దికాలం క్రితం లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎవరు ఊహించని విధంగానే సీట్లను సంపాదించుకుంది.రేవంత్ రెడ్డి సైతం ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచారు.
దీంతో కాంగ్రెస్ కూడా తమకు పోటీ ఇచ్చేలా తయారవుతుందని కేసీఆర్ ఆందోళనలో ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం అవకాశం కల్పించింది.
ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగుతుండడం తో ఏదో రకంగా ఆ నియోజకవర్గంలో గట్టెక్కాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.శరవేగంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో పట్టు సంపాదించేందుకు అక్కడ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించేందుకు, అవసరమైన అన్ని ప్రణాళికలను రచిస్తున్నారు.
ఈ వ్యవహారాలు కెసిఆర్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి.రేవంత్ శక్తిసామర్థ్యాలు కెసిఆర్ కు బాగా తెలిసి ఉండడంతో, హుజురాబాద్ ఎన్నికల లో రేవంత్ తమ పార్టీ అభ్యర్థిని గెలవకుండా చేయగలరని కేసీఆర్ అభిప్రాయ పడుతున్నారు.
అందుకే కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు అందరిని టీఆర్ఎస్ వైపు తీసుకు వచ్చి, వారికి కీలక పదవులు ఇచ్చి హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కకుండా చేయాలనే వ్యూహంతో ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ తెర తీసినట్లు గా కనిపిస్తున్నారు.
అందుకే నాయకులను సైతం వదిలిపెట్టకుండా, టిఆర్ఎస్ కాంగ్రెస్ ల నుంచి టిఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.త్వరలోనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదంతా రేవంత్ రెడ్డి కారణంగానే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హుజూరాబాద్ లో కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థి అయినా రేవంత్ తోనే పోటీ అన్నట్టుగా కేసీఆర్ కలవరపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.