రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బంధానికి బీటలు వారాయా? ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా? కేసీఆర్ను జగన్ కావాలనే పక్కన పెట్టేస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది.2014 సంగతేంటోగానీ.2019లో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విషయం స్పష్టంగా చెబుతూ వచ్చారు.ఇక్కడ తెలంగాణలో మళ్లీ నేనే గెలుస్తా.
అక్కడ ఏపీలో బాబు పనైపోయింది.ఈసారి జగన్ రావడం ఖాయం అని అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టిన బాబుకు గట్టిగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన కేసీఆర్.జగన్ విజయానికి తన వంతుగా సాయం చేశారని రాజకీయ పండితులు కూడా చెప్పడం విశేషం.
అందుకే తాను గెలవగానే జగన్ ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.ఆ తర్వాత కూడా తరచూ ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు.కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను కూడా కృషి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తున్నాయి.కేసీఆర్ తన అవసరం కోసం తనను వాడుకుంటున్నట్లుగా జగన్ భావిస్తుండటం.
ఆయనతో కలిసి తిరగడం కేంద్రంలోని పెద్దలకు నచ్చడం లేదన్న వార్తలు వస్తుండటంతో క్రమంగా కేసీఆర్కు దూరం జరుగుతున్నారు.ఈ మధ్య కొన్ని శుభకార్యాల్లో కలిసే పరిస్థితి ఉన్నా.
ఒకరికొకరు ఎదురు పడకుండా వెళ్లిపోతున్నారు.
ఒకప్పుడు ఇదే కేసీఆర్ను ఆకాశానికెత్తిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు.వీళ్ల మధ్య దూరం పెరగడానికి ఈ మధ్య కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ అంగీకరించారంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పడం ఏపీ సీఎంను ఇరుకున పెట్టింది.
ఇక ఆర్టీసీ విషయంలో జగన్ తనను ఇరికించినట్లు కేసీఆర్ భావిస్తున్నారు.ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి జగన్ అంగీకరించడంతో తెలంగాణలోనూ అదే డిమాండ్తో కార్మికులు సమ్మెకు దిగారు.
ఇదే విషయాన్ని ఓ ప్రెస్ మీట్లో జర్నలిస్ట్లు కేసీఆర్ను ప్రశ్నించగా.ఏపీలో మన్ను కూడా జరగలేదు.అక్కడేదో కమిటీ వేశారు తప్ప ఏమీ చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలను జగన్ వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.ఇక తాను కేసీఆర్తో జరిపిన సమావేశం తాలూకు విషయాలను కూడా కావాలనే మీడియాకు లీక్ చేశారన్న అనుమానాలు కూడా ఆయనకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.బీజేపీతో కలిసి పోరాడుదామని అప్పట్లో మీడియాలో వార్తలు రాగానే.
ఏపీ సీఎంవో దానిని ఖండించాల్సి వచ్చింది.ఆ తర్వాత కేంద్రంలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా జగన్ తీవ్రంగానే శ్రమించారు.
ఇటు కేసీఆర్ కూడా జగన్ చేస్తున్న కొన్ని పనులపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలాంటి ఐఏఎస్లను ఏపీకి ఇవ్వడానికి తాను అనుమతి ఇచ్చినా.
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండానే జగన్ వాళ్లను అనధికారికంగా వాడుకుంటున్నారు.
ఇక తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తిలకు తన ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు.
కేసీఆర్తో ఈ ఇద్దరికీ అంత మంచి సంబంధాలు లేవు.ఇలా ఈ ఇద్దరూ ఒకరికి నచ్చని పనులను మరొకరు చేస్తూ క్రమంగా తమ మధ్య ఉన్న దూరం పెంచుకుంటున్నారు.
కేసీఆర్తో చనువుగా ఉండటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
.