నేడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి కేంద్రంగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కెసీఆర్ గైర్హాజరవడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
అయితే దీని వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటు బీజేపీతో కావచ్చు, ఇటు కేంద్రంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇటు బీజేపీ, టీఆర్ఎస్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితి ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారని అందుకే తెలంగాణ రాష్ట్రం తరపున ప్రతినిధులు హాజరవుతున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి కెసీఆర్ హాజరుకాకపోవడానికి గల కారణాలు మాత్రం ఇటు టీఆర్ఎస్ మాత్రం స్పష్టం చేయనటువంటి పరిస్థితి ఉంది.
ఒకవేళ ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కెసీఆర్ హాజరైతే ఇప్పటి వరకు బీజేపీని విమర్శించి మరల బీజేపీతో దోస్తీ చేస్తున్నాడనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వందకు వంద శాతం ఉంది.అందుకే కెసీఆర్ ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయించుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ సమావేశంలో చర్చించే అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన వస్తుందనే ఆశ ప్రభుత్వానికి లేదని, నేడు ప్రస్తావించబోయే అంశాలు ఢిల్లీ కి వెళ్ళిన ప్రతి సారి కేంద్రం దగ్గర ప్రస్తావించే అంశాలే అని అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది.మరి బీజేపీ పార్టీ కెసీఆర్ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.